సింగరేణి రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ప్రపంచానికి వెలుగులు పంచుతున్నది. అలాంటి సంస్థ తెలంగాణ ఏర్పాటుతో సిరులు కురిపిస్తున్నది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి దినదినాభివృద్ధి చెందుతూ కోలిండియాకు దీటుగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నది.
-ఇల్లెందు, సెప్టెంబర్ 20:సింగరేణి పరిధిలో 9,923 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సంస్థ గుర్తించింది. 2400ల మిలియన్ టన్నుల వరకే తవ్వకాలు ప్రారంభమయ్యాయి. సంవత్సరానికి సగటున 60 మిలియన్ల టన్నుల బొగ్గును వెలికితీస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన గనులకు 60 ఏళ్ల జీవితకాలం ఉంది. బొగ్గు అన్వేషణ కొనసాగుతున్న కొద్ది మరింత కాలం పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో 0 నుంచి 600 మీటర్ల లోతున బొగ్గు నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయి. సింగరేణి ఎన్నో ఒడుదొడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొని లాభాలను ఆర్జిస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. 2002-03 నుంచి అనేక నూతన రికార్డులను నెలకొల్పింది. అదే ఏడాది ఆర్జించిన లాభాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐదు శాతం డివిడెంట్లను ప్రకటించింది. 37 ఏళ్ల విరామం తర్వాత డివిడెంట్లను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది సంస్థ నికర లాభాలు రూ.417 కోట్లు వచ్చాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 12,354 టర్నోవర్ను సింగరేణి కలిగి ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.3,579 కోట్లు వివిధ పన్నులు, రాయల్టీలు, డివిడెంట్లు, అప్పులకు వడ్డీల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. రాష్ర్టానికి రూ.1,783 కోట్లు, కేంద్రానికి రూ. 1,796 కోట్లను చెల్లించింది.
సంస్థకు మంచి భవిష్యత్తు
సింగరేణికి మంచి భవిష్యత్ ఉంది. రానున్న రోజుల్లో కొత్త బ్లాకులను ఏర్పాటు చేస్తే సంస్థను విస్తరించవచ్చు. నూతన గనులతో కార్మికుల సంఖ్య పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులను కుదిస్తూ నాటి పాలకులు కుట్రలు పన్నారు. తెలంగాణలో నూతన మైన్స్ను ఏర్పాటు చేసి కార్మికుల సంఖ్యను పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. సంస్థ మరిన్ని బొగ్గుబ్లాకులను విస్తరించేందుకు సంసిద్ధంగా ఉంది. ఇది సింగరేణికి మేలు కలిగిస్తుంది. -మల్లెల సుబ్బారావు, ఏరియా జీఎం, ఇల్లెందు
ఆటుపోట్లు ఎదుర్కొని
సింగరేణి సీమాంధ్ర పాలకుల పుణ్యమా అని అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. 1989లో క్లిష్టపరిస్థితికి దిగజారింది. 1989-97 మధ్యకాలంలో సంస్థ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా పడిపోయింది. కార్మికులు, ఉద్యోగులు వేతనాల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. 1996-97 మధ్యకాలంలో కంపెనీ రూ.1,219 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆ పదేళ్ల కాలంలో సంస్థ పారిశ్రామిక పునర్నిర్మాణ మండలి (బీఐఎఫ్ఆర్) పరిధిలోకి వెళ్లింది. 1989-90, 1992-93లో సింగరేణి బీఐఎఫ్ఆర్కు నివేదించబడింది. యూనియన్లు, కార్మికుల సమష్టి కృషితో గండం నుంచి గట్టెక్కింది. కొన్ని షరతులకు లోబడి 1993-94 రూ.17.67, 1994-95లో రూ.26.64 కోట్లు లాభాలను ఆర్జించింది. దీంతో సంస్థ బీఐఎఫ్ఆర్ నుంచి బయటపడింది. 1997 నాటికి నష్టాలు రూ.1,219 కోట్లకు చేరుకున్నాయి. బొగ్గు ధర పెరగకపోవడం, బొగ్గు నాణ్యత వంటి సమస్యలు సింగరేణిని ఆందోళనకు గురిచేశాయి. 1997-98 నుంచి 1999-2000ల మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా రూ.268 కోట్లు, రూ.256 కోట్లను అదనంగా ఈక్విటి రూపంలో ఒడ్డుకు చేర్చాయి. కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీకి గల 16.17 శాతం రుణాలకు బదులు 13శాతం బాండ్లను పూచీకత్తుగా ఉంచి 11.75 శాతం వడ్డీతో రుణాలు పొందడంతో నాలుగేళ్లలో రూ.61 కోట్లు ఆదా అయింది. వృథా ఖర్చులు తగ్గించుకొని, విద్యుత్ పొదుపు చేయడం ప్రారంభించింది. మార్కెట్ను విస్తరించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో సంస్థ నష్టాల నుంచి గట్టెక్కింది. అప్పటి నుంచి వరుసగా ఏటా లాభాలను ఆర్జిస్తూ వచ్చింది. కార్మికులకు పది శాతం నుంచి ప్రారంభమైన లాభాల వాటా బోనస్ 2012-13 వచ్చేసరికి 18 శాతానికి పెరిగింది. దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేనివిధంగా సింగరేణిలో లాభాల బోనస్ కార్మికులు తీసుకోవడం విశేషం. సింగరేణిలో రాష్ట్రం వాటా 51శాతం, కేంద్రం వాటా 49 శాతంగా కొనసాగుతూ వస్తున్నది.
విద్యుత్ సంస్థలకే అత్యధిక బొగ్గు సరఫరా
సింగరేణి బొగ్గులో 74శాతం రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తున్నది. రాష్ట్రంలోని కేటీపీఎస్కు 9.63 మిలియన్ల టన్నులు, రామగుండం(బి) పవర్హౌజ్కు 0.3 మిలియన్ టన్నులు, వీటీపీఎస్కు 5.42 మిలియన్ టన్నులు, ఎన్టీపీసీ రామగుండంకు 12.84 మిలియన్ టన్నులు, ఎన్టీపీసీ సింహాద్రికి 0.44 మిలియన్ టన్నులు, పవ్లికి 1.78 మిలియన్ టన్నులు, రాయచూర్కు 2.51 మిలియన్ టన్నులు, కప్పవ్ పవర్ హేవీవాటర్కు 3.15 మిలియన్ టన్నులు, (మణుగూరు) హేవివాటర్కు 0.45 మిలియన్ టన్నులు, సిమెంట్ పరిశ్రమలకు 5.48 మిలియన్ టన్నులు, స్పాంజ్ ఐరన్కు 0.44 మిలియన్ టన్నులు, ఇతర పరిశ్రమలకు 2.01 మిలియన్ టన్నులు సరఫరా అవుతున్నది. సింగరేణి నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణతోపాటు మొత్తం నాలుగు వేల మిలియన్ టన్నులు ఏటా సరఫరా చేస్తున్నది. విద్యుత్ ఉత్పత్తికి 38 వేల టన్నుల వరకు సరఫరా చేస్తూ వస్తుంది. సంస్థకు సంబంధించిన ఈక్విటి రూ.1733 కోట్లు ఉండగా.. నెట్వర్త్ రూ.3,378 కోట్లు ఉంది. గ్రాస్ పెట్టుబడి రూ.7,750 కోట్లు కాగా, గ్రాస్టర్నోవర్ రూ.12,354 కోట్లు ఉంది. మొత్తం 49 గనులుండగా.. ఇందులో 34 భూగర్భగనులు, 15 ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. గుర్తించిన బొగ్గునిల్వలు 9923.10 మిలియన్ టన్నులు ఉండగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 53.100 మిలియన్ టన్నుల లక్ష్యానికి 53.190 మిలియన్ టన్నులను సాధించింది. 2013-14లో 54.3 మిలియన్ టన్నులు నిర్దేశించుకొని సింగరేణి ముందుకెళ్తున్నది.