ఖమ్మం సిటీ, జులై 28 : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న రోజులు కళ్లముందే కరిగిపోతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో సర్కారు దవాఖానలు కార్పొరేట్ వైద్యసేవలకు నిలయాలుగా మారుతున్నాయి. ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నిలువెత్తు నిదర్శనంగా సాక్షాత్కరిస్తున్నది. ఇటీవలే 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను ఏర్పాటు చేశారు. అనంతరం కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ వంటి కీలక పరీక్షలు నిర్వహించే సెంటర్ను నెలకొల్పారు. తాజాగా మనిషి శరీరంలోని ప్రతి అంగుళాన్ని పరీక్షించే అత్యాధునిక ‘సిటీ స్కాన్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పెద్దాసుపత్రిలో అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
ఒకేసారి 16 ైస్లెసెస్..
విపత్కర పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ప్రైవేట్ వెళ్తే ‘సిటీ స్కాన్’కు సిఫారస్ చేసినప్పుడు సంబంధిత వ్యక్తి రోగానికి బదులు టెస్ట్కు చెల్లించాల్సిన ఫీజులను తలచుకొని హడలిపోవడం సర్వసాధారణం. కోట్లాది రూపాయలు విలువచేసే యంత్రాన్ని తీసుకురావడం, ఏర్పాట్లు, టెక్నీషియన్స్ అన్నింటినీ కలుపుకుని సంబంధిత వైద్యులు లేదా యాజమాన్యం ఎక్కువ మొత్తంలో ఫీజులు వేయడం షరామామూలే. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఖమ్మంలోని సర్కారు దవాఖానకు రూ.2.5 కోట్లు వెచ్చించి అత్యాధునిక ‘సిటీస్కాన్’ పరికరాన్ని పంపించారు. ఇది కెనాన్ కంపెనీకి చెందినది. బ్రెయిన్ (మెదడు), చాతి, బ్లాక్ ఫంగస్, పొట్ట, సెల్విస్, వెన్నుముక, ఎముకలు వంటి కీలకమైన రోగాల నిర్ధారణతోపాటు శ్వాసకోస సంబంధిత హెచ్ఆర్సీటీ పరీక్షలను చేయనున్నారు. ఒకేసారి 16 రకాల ైస్లెసెస్ను తీసే సామర్థ్యం కలిగిన యంత్రమని అధికారులు పేర్కొంటున్నారు.
ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కృషి..
ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలోని పెద్దాసుపత్రిని ఆధునిక వైద్యానికి కేరాఫ్గా మార్చారు. తాను 2014లో ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ కార్పొరేట్ వైద్యానికి తెరలేపారు. ఈ ఏడాది కరోనా సెకెండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నప్పుడు, ప్రైవేట్లో లక్షలాది రూపాయలు ధారబోసినా ప్రాణాలు దక్కని విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో సకల సౌకర్యాలు కల్పించారు. బాధితులకు సరిపడా ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ తీసుకొచ్చి పేదల ప్రాణాలకు పెద్ద దిక్కుగా మారారు. తనదైన శైలిలో కృషి చేసి ప్రభుత్వ హాస్పిటల్కు ‘సిటీ స్కాన్’ సేవలను తీసుకొచ్చారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని సాధించిన ఘనత మంత్రి అజయ్కుమార్కే దక్కుతుందని దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బీ శ్రీనివాసరావు అన్నారు.