ఆళ్లపల్లి, సెప్టెంబర్ 28: కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని అధికారులకు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. మొదటగా రాయిపాడు వద్ద లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించారు. ఆళ్లపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. మొక్కలు నాటడం పూర్తికాకపోవడంతో ఎంపీడీవో మంగమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్సింగ్ సెంటర్ నుంచి రోడ్డు నిర్మాణం కోసం గ్రాంట్కు అంచనాలు వేయాలని పంచాయతీ ఏఈకి సూచించారు. మర్కోడులోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవల గురించి ఏఎన్ఎం సావిత్రిని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ శాతం గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ఆన్లైన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నట్లు గమనించి.. వారంలోగా వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాలని సూచించారు. అందుకు కావాల్సిన కరోనా వ్యాక్సిన్ డోస్లను జిల్లా ఆసుప్రతి నుంచి తెప్పించుకొని వారంలోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
మర్కోడు పంచాయతీ పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. ఇద్దరి మహిళా కార్మికుల వేతనాలను పెంచాలన్నారు. మర్కోడులో పారిశుధ్య పనులు, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో కార్యదర్శి నాగరాజును అభినందించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని తహసీల్దార్ సాదియా సుల్తానాకు సూచించారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్, బ్యాంకు సేవలు, విష జ్వరాలు, గ్యాస్ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందించారు. జడ్పీటీసీ కొమరం హనుమంతరావు, ఎంపీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ అఖిల్, ఆర్ఐ శ్రీనివాస్, ఏపీవో రఘునాథ్, రాయిపాడు, ఆళ్లపల్లి సర్పంచ్లు ఊకె ఈశ్వరి, మెస్సు కోటేశ్వరరావు, కార్యదర్శి ప్రవీణ్, మర్కోడు ఉప సర్పంచ్ కుర్ర కమల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.