కొత్తగూడెం, ఆగస్టు 3:కొవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తున్నది. వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి నిరంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నది. థర్డ్ వేవ్ను అడ్డుకోవడానికి తిరుగులేని ప్రణాళికలు రూపొందించింది వాటిని అమలు చేస్తున్నది. ఒకవైపు కరోనా బారిన పడుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే మరోవైపు పట్టువదలకుండా ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తున్నది. సోషల్ మీడియాలో వ్యాక్సిన్పై అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ విజయవంతంగా వ్యాక్సినేషన్ చేపడుతున్నది. భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ నిరంతరం కొనసాగుతున్నది. వైద్యారోగ్యశాఖ తొలి విడతలో ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా ఇచ్చింది. ఆ తర్వాత వైద్యశాలల్లో పనిచేస్తున్న వారికి, ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన సాధారాణ ప్రజలకు టీకా ఇచ్చింది.
40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్..
వ్యాక్సిన్ తీసుకోవడానికి మొదట్లో ప్రజలు సంశయించారు. కానీ ఒక్కొక్కరుగా వ్యాక్సిన్ తీసుకోవడం, ఆ తర్వాత కొవిడ్ సెకండ్ రావడం, ప్రభుత్వాలు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించడంతో వ్యాక్సినేషన్ ప్రాధాన్యత ప్రజలకు అవగతమైంది. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలోని 40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రకియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు జిల్లాలో 3,19,281 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. వీరిలో కోవాగ్జిన్ తీసుకున్న వారు 35,658 మంది, కోవీషీల్డ్ 2,83,623 మంది ఉన్నారు.
ఆధార్ ఉంటే చాలు..
ఆధార్ తీసుకుని వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చిన వారికి వైద్యసిబ్బంది వ్యాక్సిన్ ఇస్తున్నారు. అప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో టీకా ప్రక్రియ మరింత సులభమైంది. వ్యాక్సినేషన్ను కలెక్టర్ అనుదీప్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ శిరీషా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
వ్యాక్సిన్ తప్పనిసరి..
అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచనలు పాటిస్తూ వయస్సుల వారీగా వ్యాక్సిన్ ఇస్తున్నాం. 18 ఏళ్లలోపు వారికి ఇంకా అనుమతులు రాలేదు. ఇతర వయస్సుల వారికి ప్రతిరోజు వ్యాక్సిన్ ఇస్తున్నాం. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు ప్రజలకు ముందుగానే సమాచారం ఇస్తున్నాం. ఆ రోజు కేంద్రాలను మూసి ఉంచుతున్నాం. జిల్లాలో 40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేపడుతున్నాం.
-డాక్టర్ నాగేంద్రప్రసాద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, కొత్తగూడెం
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
వ్యాక్సినేషన్ ప్రారంభమైన కొత్తలో టీకా ప్రక్రియ కాస్త ఇబ్బందికరంగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లు, యాప్లు సరిగా తెరుచుకునేవి కాదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ వైద్యారోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే ఫ్రంట్లైన్ వారియర్స్, సూపర్ స్ప్రెడర్స్, జర్నలిస్టులతో పాటు విడతల వారీగా ఇతర విభాగాల వారికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు.