భద్రాచలం, ఏప్రిల్ 15 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం నుంచి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవాహ్నిక మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణాన్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. అందుకనే వీటిని శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు.
రేపటి నుంచి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు
శనివారం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనం, సాయం త్రం పుట్టమన్నుతో పూజ, వాస్తు హోమం, బ్రహ్మోత్సవ అంకురారోపణ చేస్తారు.
ఈసారీ బేడా మండపంలోనే..
కొవిడ్ కారణంగా ఈసారి కూడా సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న నిత్య కల్యాణాన్ని నిర్వహించే బేడా మండపమే వేదిక కానుంది. తొలుత చిత్రకూట మండపంలోనే 21న సీతారాముల కల్యాణం, 22న రామయ్య పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చిత్రకూట మండపంలో గాలి, వెలుతురు సరిగా రానందున దేవాదాయ శాఖ అధికారులు, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వేదికను మళ్లీ బేడా మండపానికి మార్చినట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ తెలిపారు.
శిల్పకళా శోభితం..
55 ఏళ్లుగా మిథిలా స్టేడియంలో నిర్మించిన శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేవారు. కరోనా కారణంగా ఈసారి కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్నందున రామయ్య కల్యాణాన్ని స్టేడియంలో కాకుండా నిరుటి మాదిరిగానే ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.