ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 2: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఎంసెట్-2021ను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 4 నుంచి నిర్వహించే ఆన్లైన్ పరీక్షకు సంబంధించి ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు అగ్రికల్చర్ పరీక్షను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 9,150 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 5,490 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పరీక్షల కో ఆర్డినేటర్ పద్మావతి తెలిపారు.
పూర్తిగా ఆన్లైన్లో..
ఇంటర్ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూ ప్రత్యేక శ్రద్ధ వహించాయి. పూర్తి పారదర్శకంగా పరీక్ష జరిగేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థికీ కేటాయించిన ప్రత్యేక కంప్యూటర్ను టీసీఎస్ సంస్థ ప్రతినిధులు నిశితంగా పరిశీలిస్తారు. తర్వాతే వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కంప్యూటర్లను ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.పద్మావతి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది.
అత్యధిక సీసీ కెమెరాలు..
జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలనే ఎంసెట్ ఆన్లైన్ పరీక్షకు ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో చాలా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన అనుభవం ఉన్నవాటికి అవకాశం ఇచ్చారు. ఆయా కళాశాలల్లో ఉన్న సీసీ కెమెరాలతోపాటు టీసీఎస్ సంస్థ అదనంగా మరిన్ని సీసీ కెమెరాలను అమర్చింది. కేంద్రంలోకి వచ్చే విద్యార్థులు ఏయే పరిసరాల్లో ఉన్నారో అనే అంశాలను క్షుణ్ణంగా గమనించేలా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష రాసే సమయంలో సైతం విద్యార్థులు ఇతర విద్యార్థుల కంప్యూటర్ల వైపు చూసినా గుర్తించేలా అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించినట్లు సమాచారం. ఉన్నతాధికారులు అన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణను సీసీ కెమెరాల సహాయంతో పర్యవేక్షించవచ్చు.
ఆరు కేంద్రాలు.. రెండు సెషన్లు..
జిల్లాలో ఆరు ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున మూడు రోజులపాటు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష జరుగనుంది. ఆయా కళాశాలల్లోని కంప్యూటర్ల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులను కేటాయించారు. ఖమ్మంలో కిట్స్, డేర్, ఎస్బీఐటీ, బొమ్మ, విజయ, ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలను నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా పరిధిలో అనురాగ్, సన, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా సెంటర్లను ఏర్పాటుచేశారు. ఒకటో సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. సుమారు గంటన్నర ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
కేంద్రానికో పరిశీలకుడు..
పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రానికి ఒక పరిశీలకుడిని నియమించారు. జిల్లాలో ఆరు కేంద్రాలకు ఆరుగురు అబ్జర్వర్లను నియమించారు. బుధవారం నుంచి ఎంసెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఎంసెట్ సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం.
-డాక్టర్ పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్