కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 1: సదరం సర్టిఫికెట్ల మంజూరు ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో క్యాంపులు నిర్వహించి అర్హులైన వారికి వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు అందిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఐకేపీ కార్యాలయంలో క్యాంపుల నిర్వహణ జరుగుతున్నది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపులు నిర్వహించడంతో దివ్యాంగులు సర్టిఫికెట్ కోసం డీఆర్డీఏ కార్యాలయానికి వచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ నుంచి ఐకేపీ కార్యాలయాల్లోనే క్యాంపులు నిర్వహించడం, ప్రక్రియను సులభతరం చేయడంతో దివ్యాంగులకు ఇబ్బందులు తప్పాయి.
44 క్యాంపుల నిర్వహణ
భద్రాద్రి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 44 సదరం క్యాంపులు జరిగాయి. మొత్తం 7,279 మంది క్యాంపులకు హాజరుకాగా 5,920 మందిని అర్హులుగా వైద్య సిబ్బంది గుర్తించారు. మిగిలిన 1,359 మందిని అనర్హులుగా తేల్చారు. అర్హులైన వారిలో 2,100 మంది ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నారు. అర్హుల్లో శారీరక వైకల్యం కలిగినవారు 3,905 మంది, బుద్దిమాంద్యం ఉన్నవారు 503 మంది, వినికిడి లోపం ఉన్నవారు 473మంది, మానసిక రుగ్మత గలవారు 590 మంది, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు 449 మంది ఉన్నారు.
ఆన్లైన్లో స్లాట్బుకింగ్..
సదరం క్యాంపులకు హాజరయ్యేవారు ఆసుపత్రులు, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. గతంలో క్యాంపునకు హాజరైనవారు, అనర్హులు సైతం సర్టిఫికెట్ పొందాలని వస్తుండడంతో తొలిసారి క్యాంపునకు హాజరయ్యే దివ్యాంగులకు ఇబ్బంది కలుగుతున్నది. దీనికితోడు క్యాంపు నిర్వహణకు అవసరమైన వసతులు సమకూర్చడం తలకు మించిన భారమయ్యేది. కొవిడ్ కారణంతో గతేడాది క్యాంపు నిర్వహణ వాయిదా పడింది. కొవిడ్ కేసులు తగ్గిన తర్వాత దివ్యాంగుల బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని తెచ్చింది. కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో మీ సేవా సెంటర్ల ద్వారా స్లాట్ బుక్ బుకింగ్కు అవకాశం ఏర్పడింది. దీంతో బుకింగ్ ఉన్నవారు మాత్రమే క్యాంపునకు హాజరయ్యారు. దీంతో అధికారులకు క్యాంప్ నిర్వహణ సులభమైంది. క్యాంపు జరిగిన వారం రోజుల్లోనే అర్హులందరికీ సర్టిఫికెట్లు అందుతున్నాయి.
వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు..
సదరం క్యాంపులు నిర్వహించి వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు అందజేస్తున్నాం. ఇప్పటివరకు నిర్వహించిన క్యాంపులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఒక్కటి కూడా పెండింగ్లో లేదు. ఎప్పటికప్పుడు ఈ క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తున్నాం. క్యాంపులకు హాజరైన వారందరూ డీఆర్డీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. హాజరైనవారిలో అర్హులు ఉంటే నేరుగా వారికే ఫోన్ చేసి సర్టిఫికెట్ అందిస్తాం.
-మధుసూదనరాజు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, కొత్తగూడెం