మామిళ్లగూడెం, అక్టోబర్ 26: ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్ టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్లకు సూచించారు. కొవిడ్ టీకాల స్పెషల్ డ్రైవ్ పురోగతిపై మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా వేసేందుకు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, వీఆర్ఏలు, ఆశా వర్కర్లతో మల్టీ టీంలను ఏర్పాటు చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో టీకా ప్రక్రియను వేగవంతంగా చేసి పర్యవేక్షణ పెంచాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి 100 శాతం టీకా ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు 10.60 లక్షల మంది ఉన్నారని, వారిలో 8,20,593 మందికి మొదటి డోస్ వేశామని, 2,73,642 మందికి రెండో డోస్ వేశామని వివరించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎంహెచ్వో మాలతి, జడ్పీ సీఈవో అప్పారావు, వైద్యులు అలివేలు, రాజేశ్, కోటిరత్నం, సైదులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మండలాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా వేయాలని సూచించారు.