ఖమ్మం, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు పక్షపాతిగా తెలంగాణ సర్కార్ రైతులను ఆదుకుంటున్నది. రైతులను రారాజు చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబ రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రైతు బీమా పథకం అమలు చేస్తున్నది. అందుకు ప్రభుత్వమే స్వయంగా బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తున్నది. ఇంటి యజమాని చనిపోయిన అతి తక్కువ రోజుల్లో నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ చేసి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేస్త్తున్నది. సీజన్కు ముందే పెట్టుబడి సాయం అందిస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారి సాగు భరోసా కల్పిస్తున్నది. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నది. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు రెండేళ్ల క్రితం రూ.25 వేల వరకు బ్యాంకులో తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. తాజాగా ఆదివారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ రూ.50 వేల వరకు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.
3.25 లక్షల మందికి లబ్ధి..
అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు తీసుకున్న రుణాలను 2015 -18 వరకు ప్రభుత్వం వాయిదాల పద్ధతిన సంవత్సరానికి రూ.409 కోట్ల చొప్పున ఏటా చెల్లించింది. దీని ద్వారా 3,25,325 మంది రైతులు ప్రయోజనం పొందారు. తాజాగా రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో జిల్లాలో 1.70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. సుమారు రూ.1,200 కోట్ల రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో రైతులకు రుణభారం నుంచి ఊరట కలుగనున్నది. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబరు 11 లోపు రూ.25 వేల వరకు రుణం తీసుకున్న వారికి తొలివిడతలో ప్రభుత్వం మాఫీ చేసింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.50 వేల వరకు రుణం తీసుకున్న వారి రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రూ.25 వేల వరకు రుణం తీసుకున్న 21,978 మందికి రూ.28.4 కోట్ల రుణాన్ని మాఫీ చేసింది. విడతల వారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తుండడంతో రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రఘునాథపాలెం, ఆగస్టు 2: రూ.50 వేల లోపు బ్యాంకు ద్వారా వ్యవసాయ రుణం తీసుకున్న వారి రుణాల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినేట్ సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రఘునాథపాలెం మండలానికి చెందిన రైతులు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మండలంలోని పాపటపల్లిలో ఖమ్మం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్గౌడ్ ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో చెన్నబోయిన సైదులు, భద్రయ్య, ఉయ్యూరు వెంకటనారాయణ, దుంపటి లక్ష్మణ్ పాల్గొన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్..
రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నారు. అన్నదాతల కష్టాలు ముఖ్యమంత్రికి తెలుసు. ఉద్యమ సమయంలో రైతుల కష్టాలను స్వయంగా చూసిన ఆయన వారికి అవసరమైన పథకాలు రూపొందిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. తాజాగా రెండోసారి రుణమాఫీ ప్రకటన రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.