ఐసొలేషన్ కేంద్రం ద్వారా మెరుగైన సేవలు
కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 29: కరోనాపై భయం వీడి మనోధైర్యంతో ముందుకు సాగితే బాధితులు త్వరితగతిన కోలుకుంటారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అభిప్రాయపడ్డారు. మండలంలోని సుదిమళ్ల వైటీసీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. కేంద్రంలో బాధితుల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పరీక్షల సామగ్రి, మందులు, వైద్య సిబ్బంది తదితర అంశాలన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ రెండో దశలో కొవిడ్ వ్యాప్తి వేగవంతంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారి కోసం నియోజకవర్గ స్థాయిలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని చెప్పారు.
సుదిమళ్ల వైటీసీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో బాధితులకు అన్ని సౌకర్యాలనూ ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర సలహాదారు పులిగళ్ల మాధవరావు, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి, వైస్ ఎంపీపీ ప్రమోద్కుమార్, కో ఆప్షన్ గాజీ, కౌన్సిలర్లు యలమందుల వీణ, ఆజాం, సర్పంచ్లు కల్తి పద్మ, వల్లాల మంగమ్మ, తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, వైద్యాధికారి వరుణ్, సుదిమళ్ల కార్యదర్శి నాగమణి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రేణుక, ప్రధాన కార్యదర్శి యలమద్ది రవి, యలమందుల వాసు, వల్లాల నర్సయ్య పాల్గొన్నారు.