కొత్తగూడెం, జూలై 31 : సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వరరావు మలేరియా నివారణ బృందాలను ఏర్పాటు చేసి స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం 186 మందికి మలేరియా తేలింది.వారంతా వైద్యారోగ్యశాఖ పరిధిలో చికిత్స పొందుతున్నారు. 10 మంది డెంగీ బారిన పడి కోలుకుంటున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నది. హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి డ్రై డే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని చర్ల మండలంలోని పూసుగుప్ప, కుర్నవల్లి, కరకగూడెం, అశ్వాపురం మండలంలోని పలు గ్రామాలు, మంగపేట పంచాయతీ పాతగుండాలపాడు, పాల్వంచ మండలంలోని రావిచెలక, రేగులగూడెంతో పాటు మొత్తం 297 గ్రామాలను వైద్యారోగ్యశాఖ హైరిస్క్ గ్రామాలుగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. దోమల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. దోమతెరలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.53 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో మలేరియా కేసులు నమోదు కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
దోమల నివారణకు చర్యలు..
వచ్చే మూడు నెలల కాలంలో విష జ్వరాలు అవకాశం ఉన్నందున వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. సిబ్బంది గ్రామాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు గంబూషియా చేపపిల్లలు వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఈ చేపలను సిద్ధంగా ఉంచారు. వన బంధు యోజన కింద భద్రాచలంలో ఈ ఫిష్ పాండ్ ఏర్పాటైంది.
ఇంటింటికీ సర్వే..
సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం కావడంతో వైద్యారోగ్య సిబ్బంది ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నారు. అనారోగ్య బాధితుల నుంచి రక్త పూతలు సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. ముందుజాగ్రత్తగా మందులు పంపిణీ చేస్తున్నా. చిన్నవి, పెద్దవి అన్ని కలిపి 1,592 గ్రామాల్లో సర్వే చేపట్టారు. వైద్యం అవసరమైన వారిని సమీప ప్రభుత్వాసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
విష జ్వరాలు తక్కువే
మలేరియా, డెంగీ జ్వరాలు గతేడాది కంటే ఈసారి తక్కువే. గతేడాది మలేరియా కేసులు 293 ఉంటే ఈసారి 186 కేసులు నమోదయ్యాయి. గతేడాది డెంగీ కేసులు 26 నమోదు కాగా ఈసారి 10 కేసులు నమోదయ్యాయి. ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. వైద్యారోగ్య సిబ్బంది ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేస్తున్నారు.
-డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి, కొత్తగూడెం