తెలంగాణాకే ఆదర్శం ఖమ్మం అభివృద్ధి..
ఖమ్మం నగర పాలక సంస్థ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రూ.4 కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.70 కోట్లతో గోళ్లపాడు చానల్ పనులు, రూ.14 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ అమృత్ పథకంలో రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా.. నగరంలో ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నీరు అందించారు. 17,043 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రూ.73.50 లక్షలతో జిల్లా ప్రధాన గ్రంథాలయం, గాంధీపార్కు గ్రంథాలయాలను ఆధునీకరించారు. నగరంలో రూ.28 కోట్లతో రెండు స్టేజ్లలో నిర్మించిన ఐటీ హబ్ ప్రారంభించారు. రూ.70 కోట్లతో ధ్వంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జీని నిర్మించారు. ముస్తాఫానగర్ నుంచి ధ్వంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మించారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లి వద్ద 1,210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు కేటాయించారు. నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపర్చే లక్ష్యంతో రూ.50 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరు చేయగా.. ఖమ్మానికి 7000 కేటాయించారు. ఒక్కో ఇంటికి రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.250 కోట్లతో డబుల్ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. కొన్నిచోట్ల డబుల్ ఇండ్లను పేదలకు కేటాయించారు.
సాంకేతిక విద్యను అభ్యసిస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్తున్న యువత కోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ‘ఐటీహబ్’ను తీసుకొచ్చారు. ప్రభుత్వం రూ. 25 కోట్లను కేటాయించగా మొదటి దశ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. రెండో దశ నిర్మాణానికి కూడా రూ.36 కోట్లు మంజూరయ్యాయి.
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక కృషితో ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.14 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఎన్నెస్పీ క్యాంపులో రూ.17.05 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మించారు. దీన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్కు రద్దీ తగ్గింది. ట్రాఫిక్ సమస్య తీరింది..
పల్లె, పట్టణ ప్రగతికి శ్రీకారం..
గ్రామాల పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. మొదటి, రెండో దశ కింద అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా గుణాత్మక మార్పును సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 584 గ్రామపంచాయతీల్లో డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీలు ఏర్పాటు చేశారు. పారిశుధ్య పనులు మెరుగుపర్చి ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరిసేలా పనులు పూర్తి చేశారు. ఉపాధి హామీలో భాగంగా రూ.11.84 కోట్లతో ఇంకుడుగుంతలు నిర్మించారు. రూ.3.33 కోట్లతో వైకుంఠధామాలు, రూ.1.39 కోట్లతో డంపింగ్యార్డులు చేపట్టారు. అంతేకాదు, వేలాడే విద్యుత్ తీగలను, వంగిన స్తంభాలను సరిచేశారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను మార్చి కొత్త స్తంభాలను అమర్చారు. పంచాయతీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.87.42 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.ప్రంచాయతీలకు 584 ట్రాక్టర్లను అందించింది.
రూ.వెయ్యి కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి..
నగరంలో రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కుతున్నది. నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నది. ఈ నిధులతో అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రతిపాదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్రజల అవసరాలకు తగిన విధంగా కార్పొరేషన్ కార్యాలయాన్ని నిర్మించేందుకు రూ.14 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. గ్రేటర్ తరహాలో ఖమ్మం ఎన్నెస్పీ, మరికొన్ని ప్రాంతాల్లో రూ.10 కోట్లతో ఏసీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించారు.
4.75 లక్షల కుటుంబాలకు మంచినీరు..
ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో పాలేరు, వైరా, గోదావరి సెగ్మెంట్లుగా ఏర్పాటు చేశారు. మంత్రి అజయ్కుమార్తోపాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ నిరంతర సమీక్షలు చేయడం, సహకారం అందించడంతో త్వరితగతిన పనులు పూర్తి చేయగలిగారు. పాలేరు, వైరా సెగ్మెంట్ల పరిధిలో నూరుశాతం పైపులైన్ వేశారు. అవసరమైన ట్యాంక్లు ఖమ్మం జిల్లాలో 519ని మంజూరు చేయగా.. వాటిని నిర్మించారు. కొత్తగూడెం జిల్లాలో 752 ట్యాంక్లు కొత్తగా మంజూరు చేయగా.. వాటినీ పూర్తి చేశారు. మొత్తం 21 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి అయ్యింది. 20.77 మెగావాట్ల విద్యుత్ను వినియోగించుకున్నారు. 2,343 గ్రామాలకు ప్రయోజనం కలుగుతున్నది. 1,605 ట్యాంక్లు పాతవాటినే వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో 4.75 లక్షల కుటుంబాల ఇండ్లకు నల్లాద్వారా మంచినీరు అందిస్తున్నారు. మూడు సెగ్మెంట్ల పరిధిలో రూ.3,389 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. పాలేరు రిజర్వాయర్ నుంచి 6 మండలాలతోపాటు ఖమ్మం కార్పొరేషన్కు, వైరా రిజర్వాయర్ నుంచి 11మండలాలు, ఒక మున్సిపాలిటీకి గోదావరి నుంచి 3 మండలాలు, ఒక మున్సిపాలిటీకి నీటి సరఫరా చేస్తున్నారు.
రూ.335.59 కోట్లతో భక్తరామదాసు పూర్తి
భక్తరామదాసు ప్రాజెక్టును రూ.335.59 కోట్లతో కేవలం 11 నెలల సమయంలోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.16 కోట్లతో భూసేకరణ చేపట్టారు. మోటార్లు, పంపుల కోసం రూ.32.44 కోట్లు ఖర్చు చేశారు. పైపుల నిర్మాణం కోసం రూ.163.73 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. సుమారు 33 కిలో మీటర్ల దూరం ఈ పైపులైన్ నిర్మించారు. 25 మెగావాట్ల విద్యుత్ సబ్ స్టేషన్ కోసం రూ.30.84 కోట్లను కేటాయించారు. సివిల్ పనులు, ఎలక్ట్రో-మెకానికల్, హైడ్రోమెకానికల్ పనుల కోసం రూ.125 కోట్లు ఖర్చు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలేరు జలాశయం ఎగువభాగం నుంచి ఎత్తిపోతలతో ఎస్సారెస్పీ కాలువల ద్వారా తాగునీటిని అందిస్తున్నది. తిరుమలాయపాలెం మండలంలో 17.286 ఎకరాలు, కూసుమంచి మండలంలోని 23,448 ఎకరాలు, నేలకొండపల్లి మండలంలోని 2,958 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలోని 12,605 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో 2,440 ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలోని 1,120 ఎకరాలకు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తున్నారు.
పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు..
ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఘననీయమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాను పోలీస్ కమిషనరేట్గా ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తాన్ని పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. సత్తుపల్లి, ఖమ్మం, ఖమ్మం రూరల్, వైరా పోలీస్ సబ్డివిజన్లలో డీఎస్పీల స్థానంలో ఏసీపీలుగా పరిగణించారు. ఎస్పీ స్థానంలో ఎస్పీ కెడర్లో ఉన్న అధికారిని నియమించారు. ఆయన కమిషనర్గా వ్యవహరిస్తున్నారు.