అది మారుమూల గిరిజన గ్రామం.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్చేది. ఉమ్మడి పంచాయతీలో రవాణా సౌకర్యం లేక రేషన్ బియ్యం కోసం 3 కిలో మీటర్లు కాలినడకన వెళ్లేవారు. ఇలా సమస్యలతో సతమతమైన పల్లె నేడు అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతుండగా.. పచ్చదనం కనువిందు చేస్తోంది. వైకుంఠధామంతో ఆఖరి మజిలీకి కష్టాలు తీరాయి. చిన్న పంచాయతీ అయినా.. అభివృద్ధికి చిహ్నంగా మారింది.
ఒకప్పుడు ఉమ్మడి పంచాయతీలో రవాణా సౌకర్యం లేక రేషన్ బియ్యం కోసం 3 కిలో మీటర్లు కాలినడకన వెళ్లేవారు. అభివృద్ధికి నోచుకోలేక సమస్యలతో గిరిజనులు సతమతమయ్యారు. గ్రామంలోని ప్రధాన రహదారి ఇరువైపులా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండేది. ఇలా వివిధ సమస్యలతో మద్దికొండ గ్రామం కొట్టుమిట్టాడుతూ ఉండేది. అశ్వారావుపేట మండలం మద్దికొండ అలియాస్ భీమునిగూడెం పూర్తిగా గిరిజన గ్రామం. 2018 వరకు జమ్మిగూడెం పంచాయతీలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో మద్దికొండ గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ గ్రామ రూపురేఖలు మారుతూ వచ్చింది. చిన్న పంచాయతీలే అభివృద్ధికి చిహ్నాలుగా చూపించడానికి ఈ గ్రామపంచాయతే నిదర్శనం.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతితో ఈ గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ గ్రామం ఆహ్లాదంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇక్కడి పాలక వర్గం గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నది. మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండడంతో గ్రామ వీధులన్ని పరిశుభ్రంగా మారాయి. గ్రామంలోని రేషన్ షాపు ఏర్పాటు చేయడంతో ప్రధాన సమస్య తీరింది. గతంలో ఉమ్మడి పంచాయతీ జమ్మిగూడేనికి సుమారు 3 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునేవారు. సరియైన రవాణా సౌకర్యం ఉండేది కాదు. కానీ జాతీయ రహదారి గుండా అచ్యుతాపురం నుంచి మద్దికొండ మీదుగా మల్కారం, దమ్మపేటకు ఆర్టీసీ బస్ సర్వీసును ప్రజలు సాధించుకున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి..
గ్రామంలో మొత్తం 630 జనాభా ఉండగా 160 ఇండ్లు ఉన్నాయి. 560 మంది ఓటర్లు ఉన్నారు. 30 శాతం అక్షరాస్యత ఉన్న ఈ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. గ్రామానికి అవసరమైన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, పచ్చదనం పెంపొందించేందుకు హరితహారం నర్సరీని ఏర్పాటు చేశారు. అలాగే చెత్త సేకరణకు డంపింగ్ యార్డు నిర్మాణం తుదిదశకు చేరకుంది. హరితహారంలో నాటిన మొక్కలు మానులుగా ఎదుగుతున్నాయి. ప్రతి ఏటా ఎస్ఎఫ్సీ నుంచి రూ.4 లక్షలు, టీఎఫ్సీ నుంచి రూ.5 లక్షలు, జనరల్ ఫండ్ నుంచి రూ.25 వేలు చొప్పున గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.
అభివృద్ధి సామాజిక బాధ్యత
గ్రామ పంచాయతీ అభివృద్ధిని సామాజిక బాధ్యతగా భావించి పని చేస్తున్నాను. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. మండల అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని అభివృద్ధ్దికి కృషి చేస్తున్నాను. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నాం.