ఆరుగాలం కష్టించి సాగు చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించి పంట పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ‘రైతుబంధు’తో చేయూతనందిస్తున్నది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పండించిన పంటకూ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మద్దతు ధర అందిస్తున్నది.
పత్తి రైతులకు ఈ ఏడాది కలిసొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో కర్షకులకు నకిలీల బెడద నుంచి విముక్తి కల్పించింది. నాణ్యమైన విత్తనాలు అందించడంతో ఈసారి పత్తి దిగుబడి భారీగా వచ్చింది. రైతులు వరికి బదులుగా పత్తి, ఇతర పంటలు సాగు చేయాలని సర్కార్ సూచించడం.. రోజురోజుకూ ధరలు పెరుగుతుండడంతో ఎక్కువశాతం మంది రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపారు. గతంతో పోలిస్తే ఈ సారి పత్తికి డిమాండ్ ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా అదేస్థాయిలో పెరిగింది. ఈ ఏడాది పత్తికి గరిష్ఠంగా క్వింటాల్కు రూ.8,350 ధర పలికింది. ఇతర మార్కెట్లో రూ.7,500 ధర ఉండగా.. సోమవారం జూలూరుపాడు మార్కెట్లో రూ.8,350 ధర పలికింది.
ఈ సారి అనుకున్న దాని కంటే అధికంగా దిగుబడి వచ్చింది. వర్షాలు కూడా సకాలంలో కురవడం, పత్తి పంట ఏపుగా పెరిగి పూత, కాత బాగుంది. ధర ఎలా ఉంటుందోనని భయపడ్డాను. రూ.8వేలకు పైగా పలుకుతుండడంతో మాకు ఆనందంగా ఉంది. దిగుబడికి తగ్గట్టుగా ధర ఉంది. వచ్చే ఏడాది కూడా పత్తి సాగు చేస్తాను. అంతర్ పంటలను కూడా వేస్తాను. – బానోత్ బాల, పోకలగూడెం
ధర బాగుంది ..
ఈ ఏడాది పత్తి పంటకు డిమాండ్ బాగా పెరిగింది. గతేడాది కంటే ఈ సారి రెండు ఎకరాలు ఎక్కువగా పత్తి వేశాను. ఆశించిన దాని కంటే ఎక్కువ దిగుబడితోపాటు ఆదాయం వచ్చింది. ఇంత మద్దతు ధర వస్తుందని అసలు ఊహించలేదు. నాకు సంతోషంగా ఉంది. శ్రమకు తగిన ఫలితం దక్కింది. – బానోత్ బాల్య, పోకలగూడెం
ప్రతిసారి సీసీఐలో మంచి ధర ఉండేది. ఈ ఏడాది పత్తికి సీసీఐ కంటే మార్కెట్లోనే ధర భారీగా వస్తున్నది. మొదట్లో రూ.5,700 మద్దతు ధర ఉంటే అసలు ధర పెరుగుతుందో లేదోనని ఆందోళన చెందాను. పత్తి చేతికొచ్చే సరికి రూ.7 వేలు దాటింది. ప్రస్తుతం రూ.8 వేలు దాటడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడి పోను వచ్చేసారి సాగు పెట్టుబడికి సరిపడా డబ్బులు వచ్చాయి. – బానోత్ బద్దు, కోమటిపల్లి
జూలూరుపాడు, డిసెంబర్ 6 : జూలూరుపాడు మండల కేంద్రంలోని ఒంటిగుడిసె క్రాస్రోడ్ సమీపంలో ఏన్కూరు మార్కెట్కు పత్తి పోటెత్తితున్నది. ధరలు పెరుగుతుండడంతో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్ మార్కెట్యార్డుకు తెల్లబంగారం భారీగా చేరుకుటుంది. సోమవారం నిర్వహించిన జెండా పాటలో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా రూ.8,350 పలికింది. రోజూ మార్కెట్యార్డుకు సుమారు 6 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండడంతో తెల్లబంగారంతో మెరిసిపోతున్నది. పత్తి నాణ్యతగా ఉండడంతో రూ.8 వేల నుంచి రూ.8,350 వరకు ట్రేడర్లు ధర నిర్ణయిస్తున్నారు.
కేంద్రం వరి ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచిస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, లాభాలు వచ్చే పంటలు వేయాలని అవగాహన కల్పిస్తున్నది. దీంతో అన్నదాతలు ఇతర పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి జిల్లాలో పత్తి సాగుకు అనుకూలమైన నేలలు ఉండడం.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుండడం, అధిక దిగుబడులు వస్తుండడంతో రైతులు ఈ సారి అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. గడిచిన మూడేళ్లలో కర్షకులు ఏటా లక్ష ఎకరాలకు పైగా పత్తి సాగు చేయగా.. ఈ సారి 2.55 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర రూ.8 వేల వరకు ఉండడంతో ఈ సారి అంచనాకు మించి సాగు చేశారు. గతంలో పత్తికి ధర లేకపోవడంతో చాలా మంది రైతులు పత్తి వేయలేదు. ఏడేళ్లుగా పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పత్తి పంట రైతులకు సిరులు కురిపిస్తున్నది. సకాలంలో వర్షాలు కురువడం.. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో సాగుకు ఢోకా లేకుండా పోయింది. ప్రభుత్వం వరి తగ్గించి పత్తి సాగు విస్తీర్ణం పెంచాలనే సూచించడంతో రైతులు తెల్లబంగారం వైపు మొగ్గు చూపారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తుండడంతో ఎక్కువగా పత్తి సాగు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతు బంధు ఖాతాలో జమ చేస్తుండడం, బ్యాంకు రుణాలు అందుతుండడంతో రైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండాపోయింది. దీనికితోడు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను సమకూర్చడంతో తిప్పలుతప్పాయి. ప్రభుత్వం డీలర్లపై నిఘా పెట్టి నాణ్యమైన విత్తనాలు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టింది. దీంతో నకిలీ విత్తనాల బెడద తప్పి పంట దిగుబడులు అధికంగా వస్తున్నాయి. దీంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది.