ఖమ్మం, ఆగస్టు 2: గోళ్లపాడు చానెల్ అంటేనే ‘అబ్బో.. కంపు కంపు..’ అనే వారు నగర ప్రజలు. ముక్కుపుటలదిరిపోతాయని అటువైపు కూడా వెళ్లేవారు కాదు. ఆ కాలువ వెంట నివసించే ప్రజలకైతే నిత్యనరకమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నాడు కంపు కొట్టిన ప్రాంతం నేడు ఇంపుగా రూపుదిద్దుకున్నది. ఒకప్పుడు దుర్గంధం వెదజల్లుతున్న ప్రాంతం నేడు సుగంధ పరిమళాలు వీస్తున్నాయి. ఆక్రమణల కారణంగా కుచించుకుపోయి, ఎక్కడి మురుగు అక్కడే నిలిచి భరించలేని కంపు కొట్టిన ఆ కాలువను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా శుభ్రం చేసింది. దాని స్థానంలో భారీ పైపులు నిర్మించింది. వాటిపై మట్టిని కప్పివేసింది. దీంతో అంతర్భాగంలో పైపులైన్ల ద్వారా మురుగు వెళ్లిపోతోంది. ఆపైన ఉన్న మట్టిలో పట్టణ ప్రకృతి వనాలను నిర్మించింది. దీంతో ఇప్పుడా ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఒకనాడు పచ్చని పొలాలకు సాగునీరందించిన గోళ్లపాడు ఛానల్ మురుగుకూపంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఆ మురుగును తొలగించి దానిపై కప్పు వేసింది. కొత్త అందాలను తెచ్చిపెట్టింది. పట్టణ ప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతోంది. అందులో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి. పెద్దల కోసం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటయ్యాయి.
నాడు శీతకన్ను
కొన్ని రాజకీయ పార్టీల నాయకులు 66 అడుగుల కాలువను ఇరువైపులా ఆక్రమించి పేదలకు విక్రయించి రూ.కోట్లు దండుకున్నారు. వారి చర్యతో వ్యర్థాలు పేరుకుపోయి కాలువ పూడిపోయింది. విషవాయువులతో కూడిన దుర్గంధం పరిసర ప్రాంతవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రీపగలూ లేకుండా స్వైర విహారం చేసిన దోమలు సుమారు పది డివిజన్ల ప్రజలకు నరకం చూపించాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంత దశాబ్దాల దారిద్య్రానికి తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలికింది. మురుగు కూపంగా మారిన గోళ్లపాడు ఛానల్ను ఆధునీకరించింది. రూ.70 కోట్లతో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కాలువ అంతర్భాగంలో పెద్దపెద్ద పైప్లైన్లు అమర్చి మురుగునీటిని నగరానికి దూరంగా తరలిస్తోంది. వరద నీరు ప్రవహించడానికి దానిపై మరో ప్రత్యేక పైప్లైన్ కూడా వేసింది. మళ్లీ దానిపై కాలువ పొడవునా పార్కులు ఏర్పాటు చేస్తోంది. వాటిలో వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో ఆ ప్రాంతం సుందరంగా తయారైంది.
ఇదీ గోళ్లపాడు ఛానల్ చరిత్ర..
ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు ఛానల్కు సుదీర్ఘ నేపథ్యం ఉంది. సుమారు వెయ్యేండ్ల క్రితం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి సమీపం నుంచి మున్నేరు ద్వారా ప్రస్తుత నగరపాలకసంస్థ పరిధిలోని ధంసలాపురం వరకు దాదాపు 11 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ నిర్మాణమై ఉన్నది. సాగునీటి సరఫరా నిమిత్తం నాటి రాజులు ఈ గోళ్లపాడు ఛానెల్ను తవ్వించారు. దాదాపు 66 అడుగుల వెడల్పుతో ఉంది. ఖమ్మం, పరిసర ప్రాంతాలకు శతాబ్దాలుగా సాగునీరు అందించిన కాలువ ఇది. యాభై ఏండ్ల సీపీఎం, పదేండ్ల కాంగ్రెస్ పాలనలో అది మురుగునీటి కూపంగా మారింది. కాలువకు ఇరువైపులా వెలసిన అక్రమ కట్టడాలతో అది పూర్తిగా కుచించుకుపోయింది. కొన్ని చోట్ల దాని ఆనవాళ్లు కూడా లేవు. సారధీనగర్ ప్రాంతంలోని కలెక్టర్ బంగ్లా వెనుక భాగం నుంచి వస్తున్న మురుగు నీటి కాలువను మాత్రమే గోళ్లపాడు ఛానల్గా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పరిగణిస్తున్నది.
నేడు పట్టణ ప్రకృతి వనాలు
త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు ఛానల్ మురుగు కాలువ నేడు అందాల పట్టణ ప్రకృతి వనాలకు నిలయంగా మారింది. మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కాలువ పైభాగాన పార్కు ఏర్పాటు చేశారు. సుందరయ్యనగర్లో గత డిసెంబర్లోనే కాలువపైన పార్కును ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. పెద్దల కోసం ఓపెన్ జిమ్ను కూడా నిర్మించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల నిర్వహించిన పట్టణ ప్రగతిలో కాల్వొడ్డులో గల మురుగుకాలువపైనా, రంగనాయకుల గుట్ట సమీపంలోని మురుగు కాలువలపైనా పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు కూడా ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.