ఉమ్మడి జిల్లాలో శనివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జూలూరుపాడు మండలం బోజ్యాతండా సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ కాల్వలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతిచెందారు. కారేపల్లి మండలం మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గొర్ల కాపరి.. నీళ్లు తాగేందుకు వ్యవసాయ బావిలో దిగి, కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మంలో కారు ఢీకొనడంతో తల్లాడ మండలం గంగదేవిపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మృతిచెందాడు.
కాల్వలో పడి ఇద్దరు మృతి
జూలూరుపాడు, మే 21: కూలీ పనులు ముగించుకొని తోటి కూలీలతో కలిసి ఆనందంగా విందు చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదావశాత్తు కాల్వలో పడి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బోజ్యాతండా సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ కాల్వ వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పాపకొల్లు గ్రామానికి చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య(35)తో పాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఏడుగురు గ్రామంలోని ఓ రైతు పొలంలో ఎరువు తోలకం పనులు పూర్తిచేసి మధ్యాహ్నం సమయంలో విందు చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
బోజ్యాతండా పంచాయతీ పరిధిలోని బోజ్యాతండా(పుల్లుడుతండా) సమీపంలోని రాచగుట్ట ప్రాంతంలోని అడవిలో విందు చేసుకునేందుకు అంతా కలిసి వంట సామగ్రి తీసుకొని వెళ్లారు. అంతా వంట పనుల్లో నిమగ్నం కాగా బాబూరావు, నర్సింహారావు కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లారు. దుస్త్తులు, చెప్పులు కాల్వ ఒడ్డు మీద విప్పి నీళ్లలో దిగారు. కాల్వ లోతుగా ఉండడంతో ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. వీరు ఎంతకీ రాకపోవడంతో మిగిలిన స్నేహితులు గాలించగా ఒడ్డున దుస్తులు, చెప్పులు గమనించి నీళ్లలో మునిగినట్లు నిర్ధారించుకొని గ్రామస్తులు, పోలీసులకి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి ఎస్సై గణేశ్ సిబ్బందితో చేరుకొని గ్రామస్తుల సహకారంతో కాల్వలో గాలించడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. బాబూరావుకి భార్య శైలజ ఇద్దరు కుమారులు ఉన్నారు. నర్సింహారావుకి భార్య ఈశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నీళ్లు తాగేందుకు బావిలోకి దిగి..
కారేపల్లి, మే 21: కాలు జారి వ్యవసాయ బావిలో పడి గొర్లకాపరి మృతి చెందాడు. మండలంలోని మాదారం గ్రామస్తుడు బట్టు ఉపేందర్(30) శనివారం గొర్లను మేత కోసం చిన్నకట్టుగూడెం సమీపంలోని బుగ్గవాగు ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. మంచినీళ్లు తాగేందుకు అక్కడున్న వ్యవసాయ బావిలో దిగాడు. కాలు జారడంతో నీళ్లలో పడిపోయి మృతిచెందాడు. తోటి కాపరులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
కారు ఢీకొని ఉపాధ్యాయుడు..
తల్లాడ, మే 21: మండలంలోని గంగదేవిపాడు ప్రాథమిక పాఠశాల ఏకోపాధ్యాయుడు లింగాల రాజశేఖర్(48) శనివారం ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయనను కారు ఢీకొంది. ఆయన తీవ్ర గాయాలతో మృతిచెందారు. రాజశేఖర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ..
ములకలపల్లి, మే 21: మండలంలోని మాధారంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందింది. ఆమె బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు.. కూలీగా పనిచేస్తున్న సంగం పుల్లమ్మ(41) భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. ఆమెకు వివాహితులైన కుమారుడు రాము, కూతురు నాగలక్ష్మి ఉన్నారు. అదే ఊరిలో కూతురు నివసిస్తున్నది. కుమారుడు, కోడలు కలిసి రెండు నెలల క్రితం తిమ్మంపేట (కోడలి పుట్టింటికి) వెళ్లారు. అప్పటి నుంచి పుల్లమ్మ ఒంటరిగానే ఉంటున్నది. శనివారం ఉదయం పది గంటల సమయంలో పుల్లమ్మ ఇంటికి మనుమడు (కూతురు కుమారుడు) కార్తీక్ వచ్చాడు. అమ్మమ్మ నిశ్చలంగా ఉండడంతో తల్లి నాగలక్ష్మికి చెప్పాడు. కుమార్తె వెంటనే వచ్చి చూసేసరికే పుల్లమ్మ మృతిచెందింది. ఆమె ఒంటిపై అక్కడక్కడా గాయాలు ఉన్నాయి. దీంతో, నాగలక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా ఎస్సై సురేష్ కేసు నమోదు చేశారు.