కొత్తగూడెం, సెప్టెంబర్ 24: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పథకంపై విమర్శలు సరికావని హితవు పలికారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులకు చేతనైతే కేంద్రం నుంచి ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షల పథకం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వం ఏడు వేల దళిత కుటుంబాలకు 16,800 ఎకరాల భూమిని పంచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేల ఎకరాలకు సాగునీరు ఇస్తుంటే చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం అవాకులు చెవాకులు పేలుతోందన్నారు. దమ్ముంటే బీజేపీ కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం 2 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. సమావేశంలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆంతోటి నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మోరె భాస్కర్రావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పాల్వంచలో ఘన స్వాగతం..
పాల్వంచ, సెప్టెంబర్ 24: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ శుక్రవారం పాల్వంచకు విచ్చేశారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూల వేశారు. ఆయనకు విద్యార్థి సంఘాల నాయకులు చీకటి కార్తీక్, కట్టుపల్లి అంబేడ్కర్, ఎం.సందీప్, గడ్డం నర్సింహారావు, మోరె భాస్కర్, పసుపులేటి నాగరాజు, రేగులగడ్డ అర్జున్ ఘన స్వాగతం పలికారు.