ముదిగొండ, అగస్టు 2: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయకుమార్ అన్నారు. తెలంగాణ సాధించిన బక్కపలచని కేసీఆరే ఇప్పుడు దళిత బంధును అమలు చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. ముదిగొండ మండలంలోని ముదిగొండ, చిరుమర్రి, పమ్మి, వల్లభి రైతు వేదికలను సోమవారం ప్రారంభించారు. చివరిగా వల్లభిలోని జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధిస్తానని కేసీఆర్ చెప్పిన రోజున ‘ఈ బక్కపలచనోడు తెలంగాణ తెస్తడా!’ అని ఎద్దేవా చేశారనీ, నేడు దళితబంధు విషయంలోనూ అలాగే మాట్లాడుతన్నారనీ అన్నారు. ఆ నోళ్లు మూతబడే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో దళితవాడలు ఇంకా వెనుకబాటుకు గురయ్యాయని అన్నారు. వచ్చే రెండేళ్లలో రూ.లక్ష కోట్ల అయినా దళిత బంధుకు ఖర్చు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడా దిక్కులేని బీజేపీకి చెందిన తొండి సంజయ్ అనే బండి సంజయ్ అడ్డగోలు మాటలు మాట్లాడుతన్నారని విమర్శించారు.
దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కాకుండా రూ.50 లక్షలు ఇవాలంటున్న బండి సంజయ్ తమ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులకు కనీసం రూ.50 వేలు అయినా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా దళితులను ఓటుబ్యాంకుగా వాడుకున్నదే తప్ప.. ఏనాడూ వాళ్లకు చేసిందేమీ లేదని విమర్శించారు. తరువాత టీడీపీ మండల అధ్యక్షుడు పోట్ల రవితోపాటు 30 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఖమ్మం కలెక్టర్ గౌతమ్, టీఎస్ సీడ్స్ చైర్మన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీఆర్డీవో విద్యాచందన, రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో సూర్యనారాయణ, డీఏవో విజయనిర్మల, ఏవో రాధ, ముదిగొడ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి, ఏఈవోలు లిఖిత, మౌనిక, ఇందు, రఘు తదితరులు పాల్గొన్నారు.