ఖమ్మం, సెఫ్టెంబర్ 23: టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ మంచి జోష్లో కొనసాగుతున్నది. పార్టీ అధిష్ఠానం ఆదేశంతో వారం రోజుల నుంచి ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంతోపాటు నగరంలోని 57 డివిజన్లలో కార్యవర్గాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. మంత్రి అజయ్కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని కమిటీలనూ నియమించారు. రఘునాథపాలెం మండలంలోని 37 ్రగ్రామ కమిటీలతోపాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని 57 డివిజన్ కమిటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 287 బూత్ కమిటీలను నియమించారు. ఇవి కాకుండా మహిళా, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పది రోజులుగా ఈ కసరత్తు కొనసాగుతోంది. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారితోపాటు ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యమిస్తున్నారు.
టీఆర్ఎస్ నూతన ఒరవడి..
మిగిలిన పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ ముందుకెళ్తోంది. బూత్ లెవల్లో పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో అధిష్ఠానం పలు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారికి మాత్రమే పార్టీ పదవులను అప్పగిస్తున్నారు. క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న వారిని మాత్రమే డివిజన్, గ్రామ కమిటీల్లోకి తీసుకుంటున్నారు. సాధారణ సభ్యత్వం కలిగి ఉన్న వారిని పార్టీ అనుబంధ కమిటీల్లో ఉంచుతున్నారు. దీనికోసం మంత్రి అజయ్కుమార్ ఇన్చార్జులను నియమించారు. కేఎంసీలో కమిటీల నిర్మాణాలకు కోసం సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ నీరజ, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, మంత్రి పీఏ కిరణ్కు బాధ్యతలు అప్పగించారు. వీరి ఆధ్వర్యంలో కార్పొరేపన్లోని 57 డివిజన్ కమిటీల నిర్మాణం పూర్తయింది. మహిళా, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిటీలనూ ఏర్పాటు చేశారు. అనేక ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు.
అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం..
అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీ కమిటీల ఏర్పాటులో సామాజికంగా అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం కల్పించారు. ప్రతి కమిటీలోనూ కనీసం 51 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చారు. అత్యధికంగా యువతకు ప్రాధాన్యమిచ్చారు.
రేపు ప్రకటించనున్న మంత్రి అజయ్..
ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో శనివారం సాయంత్రం మమత ఆసుపత్రి ఆవరణలో సభను ఏర్పాటు చేయనున్నారు. 57 డివిజన్ల నుంచి కార్పొరేటర్లతో పాటు ప్రతి డివిజన్ నుంచి వందమందికి తగ్గకుండా నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని పార్టీ నాయకులు ఆదేశించారు. రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావాలని సూచించారు. ఇదేసభలో ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని కమిటీలనూ మంత్రి ప్రకటించనున్నారు.