బూర్గంపహాడ్, జూలై 28: జీవ వైవిద్య ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, అభివృద్ధిలో ఐటీసీ మున్ముందు కూడా భాగస్వామ్యం కావాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పేర్కొన్నారు. ఐటీసీ, ఎంఎస్కే ఆధ్వర్యంలో సారపాక పుష్కరవనం ముందు జీవ వైవిద్య ప్లాంట్ను ఐటీసీ ఉన్నతాధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీసీ ఆధ్వర్యంలో 250 హెక్టార్లలో జీవవైవిద్య ప్లాంట్ను ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. ఈ ప్లాంట్లో 2వేల మొక్కలను నాటడం, 40 వేల సీడ్స్ బాల్స్ విత్తనాలను చల్లడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగమని అన్నారు. కరోనా సమయంలో ఐటీసీ సంస్థ ఆక్సిజన్ సరఫరా చేసి ఆదుకోవడాన్ని ఎవరూ మరిచిపోలేని విషయమని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇప్పటికే ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇకముందు కూడా మరెంతో సహకారం అందించాలని ఆకాంక్షించారు. ఐటీసీ యూనిటెడ్ హెడ్ సిద్ధార్థ మహంతి, హెచ్ఆర్ మేనేజర్ శ్యాంకిరణ్, చీఫ్ మేనేజర్ చెంగల్రావు, ఎంఎస్కే ప్రోగ్రాం మేనేజర్ సాయికిరణ్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
‘బృహత్’ వనం ఆహ్లాదంగా ఉండాలి..
నాగినేప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో 8 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని తహసీల్దార్ భగవాన్రెడ్డితో కలిసి బుధవారం కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో వివేక్రామ్, ఏపీవో శ్రీలక్ష్మి, సర్పంచ్ శ్రావణి, ఉప సర్పంచ్ ఝాన్సీలక్ష్మీరాణి, గిర్దావర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.