మామిళ్లగూడెం, జూలై 31: ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించేందకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు విద్యా, వసతి సౌకర్యాలను అందిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యా సంవత్సరం అమలు చేయలేకపోవడంతో విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించింది. దీంతో దూరదర్శన్ ద్వారా యాదగిరి, నిపుణ, విద్య వంటి చానెల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అయినప్పటికీ మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన విద్యార్థులకు విద్యుత్ సౌకర్యంతోపాటు సెల్ఫోన్ నెట్వర్క్ లేదని, స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే శక్తి, సౌకర్యం లేదని, వారికి ఈ ఆన్లైన్ తరగతుల సౌకర్యం అందడం లేదని గుర్తించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. దీంతో జిల్లాలో వివిధ గిరిజన ఆశ్రమ పాఠశాలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల ఇంటికే ఈ అభ్యసన పుస్తకాలు పంపిణీ చేసేందకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
30 రోజుల గిరిదర్శిని లక్ష్యాలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాల కోసం ఈ గిరిదర్శిని అభ్యాసికను రూపొదించారు. కరోనా కాలంలో విద్యార్థులంతా తమ వయసుకి తగ్గ తరగతి పాఠాలను అర్థం చేసుకోవడం కోసం, తరగతికి తగ్గ విషయ నైపుణ్యాల్ని సాధించడం కోసం 2021-22 విద్యా సంవత్సరంలో ఆఫ్లైన్ విధానంలో 30 రోజుల బ్రిడ్జ్ కోర్సును రూపొందించారు. దీని తరువాత కనీస అభ్యసన కోర్సును ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థులకు కోర్సు మెటీరియల్ను, వారికి అవసరమయ్యే లెర్నింగ్ కిట్ను నేరుగా ఇంటికే పంపించనున్నారు. దీనిని విద్యార్థులకు నేరుగా అందించేందకు పోస్టల్ శాఖ సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ అభ్యాసిక ద్వారా విద్యార్థులు స్వయంగా చదువుకొని తరగతుల వారీగా సబ్జెక్టుల్లో సాధించాల్సిన అభ్యసన సామర్థ్యాలపై దృష్టి కేంద్రికరిస్తారు. ప్రతి విద్యార్థీ తన తరగతి స్థాయికి అనుగుణంగా సామర్థ్యాలను సాధిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సెల్ఫోన్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ వారికి విషయాల వారీగా సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రతి ఉపాధ్యాయుడికి 10 నుంచి 20 మంది విద్యార్థుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. స్వయం అభ్యసనాన్ని ప్రతి విద్యార్థికీ అలవాటు చేసేందకు అభ్యాసిక వర్క్బుక్ల మాదిరిగా ఉన్నాయి.
4,039 మంది విద్యార్థులకు లబ్ధి..
గిరిదర్శిని కార్యక్రమం ద్వారా జిల్లాలో 3 నుంచి 10 తరగతులకు చెందిన 4,039 మంది విద్యార్థులకు లభ్ధి చేకూరనుంది. 3-7 తరగతుల్లో 1,839 మంది, 8వ తరగతిలో 690 మంది, 9వ తరగతిలో 800 మంది, 10వ తరగతిలో 800 మంది విద్యార్థులకు ఈ గిరిదర్శిని పథకం అందనుంది. విద్యార్థులకు పోస్టల్ ద్వారా పంపిస్తున్న పార్సిల్ కవర్లో ఒక గిరిదర్శిని అభ్యాసిక పుస్తకం, నెల రోజుల్లో విద్యార్థులు అభ్యాసికను చదుకొని, రాసిన తరువాత తిరిగి పాఠశాలకు పంపించేందకు వీలుగా పోస్టల్ స్టాంపులు అతికించిన కవర్, అభ్యాసన సామగ్రిలో పెన్నులు-4, పెన్సిళ్లు-4, షార్ప్నర్లు-3, ఎరేజర్లు-3, పెద్ద స్కేల్-1, 12 రంగుల పెన్సిళ్ల డబ్బా-1, 12 రంగుల క్రేయాన్స్ పెన్సిళ్ల డబ్బా-1, గమ్ము బాటిల్-1 పంపించనున్నారు. విద్యార్థులకు పార్సీల్ అందిన వెంటనే పుస్తకాన్ని తిరిగి పంపించేందుకు ఉన్న పోస్టల్ ఖాళీ కవర్ను భద్రపర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం..
విద్యార్థుల చిరునామాల వారీగా పోస్టల్ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వారంలో విద్యార్థులకు గిరిదర్శిని అభ్యసిక పుస్తకాలు అందుతాయి. వారు వాటిని చదువుకోవడంతోపాటు వర్క్ బుక్లో రాయాలి. పూర్తయ్యాక తిరిగి చదువుతున్న పాఠశాలకు పంపించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాసన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులకు బాధ్యతలను అప్పగించాం. పంపించిన పుస్తకంలో విద్యార్థులకు అర్థం కాని అంశాలు ఉంటే సెల్ఫోన్ ద్వారా వారు ఉపాధ్యాయనులను నేరుగా సంప్రదించవచ్చు. వర్క్ బుక్ పూర్తి చేసిన తరువాత పుస్తకాన్ని మాత్రమే పాఠశాలకు పంపించాలి.
-కృష్ణనాయక్,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీ