ఖమ్మం రూరల్, జూలై 28 : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలో బుధవారం తెల్లవారు జాము నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు స్కార్పియో, బోలెరోతోపాటు మరో మూడు వాహనాలను ఏదులాపురం క్రాస్రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేయగా.. భారీగా గంజాయి పట్టుబడింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వాహనాలను సీజ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీఘడ్ జిల్లాకు చెందిన ఏడుగురు వ్యక్తులు పెద్దఎత్తన గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదులాపురం క్రాస్రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేయగా వాహనాల్లో భారీగా గంజాయి లభ్యమైంది. గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి గ్రామం నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆరు వాహనాలు, 146 గంజాయి ప్యాకెట్లలో సుమారు 735 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విలువ రూ.1.09 కోట్ల ఉంటుందని సీపీ పేర్కొన్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన రెండు డీసీఎం వ్యాన్లు, బోలెరో పిక్ ఆఫ్ వ్యాన్, రెండు స్కార్పియో తదితర వాహనాలను సీజ్ చేశారు. నిందితులు మండలంలోని శ్రీసిటీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారన్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు, దుస్తుల వ్యాపారం చేస్తూనే గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి తరలించి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో వెల్లడైంది. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీఘడ్కు చెందిన ఆశుమియాన్, మహ్మద్ ఆసీఫ్ఖురేషీ, అనిష్ఖాన్, మౌసీన్, ఎండీ యామిన్తోపాటు డ్రైవర్గా పనిచేసిన భద్రాద్రి జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోత్ పవన్కుమార్ను అరెస్టు చేశామన్నారు. విశాఖపట్నం చింతపల్లికి చెందిన పంగి నారాయణ, పంగి శివ తప్పించుకున్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని సీపీ పేర్కొన్నారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. స్మగ్లింగ్ మూలాలు దొరికే వరకు విచారణ కొనసాగుతుందన్నారు. జిల్లాలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గంజాయి, గుట్కా, నకిలి విత్తనాలు, ఎరువుల అమ్మకాలు, తరలింపులపై నిఘా పెంచామన్నారు. నిరంతరం వాహనాల తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ బృందాన్ని సీపీ అభినందించారు. సమావేశంలో రూరల్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజం, రూరల్ సీఐ సత్యానారాయణరెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ రవికుమార్, ఎస్సైలు శంకర్రావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.