ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 26 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చే పత్తి పంటను చూసి పొరుగు రాష్ర్టాల వ్యాపారులు ఫిదా అవుతున్నారు. నాణ్యతను పసిగట్టిన ఆయా రాష్టాల వ్యాపారులు నగరంలోనే ఉంటూ స్థానిక వ్యాపారుల సహకారంతో పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ప్రారంభంలో దూదిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుండడంతో వ్యాపారులు కొర్రీలు పెట్టి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. నెల గడిచాక క్రమంగా పత్తి ధర పెరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భిన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. పంట చేతికి వచ్చాక రైతులు నేరుగా దానిని మార్కెట్కు యార్డుకు తీసుకొస్తున్నారు. వ్యాపారులు కూడా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పోటీపడి రికార్డు స్థాయి ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది పాత పంట (నిరుటి పంట)కు నెల రోజుల క్రితం క్వింటాకు కేవలం రూ.6 వేల లోపు మాత్రమే ధర నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త పంటకు ధరలను అమాంతం పెంచేశారు. సీజన్ ఆరంభంలో క్వింటాకు రూ.6 వేలతో ప్రారంభమైన ధర కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.1800 అదనంగా పెరిగింది. మంగళవారం మార్కెట్లో క్వింటా రూ.7,800కు చేరింది. ఒకటి, రెండు రోజుల్లోనే రూ.8 వేలకు చేరే అవకాశం కన్పిస్తోంది. ఇదే అదునుగా భావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సరిహద్దు జిల్లాల రైతులు సైతం తమ పంటను ఖమ్మం మార్కెట్కు తీసుకొస్తున్నారు. అధిక ధర వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోటీపడుతున్న పొరుగు రాష్ర్టాల వ్యాపారులు
పత్తి పంట చేతికి వచ్చిన నాటి నుంచి ఖరీదుదారులు పోటీపడి మరీ పంటను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో కొనుగోలు చేసిన ప్రతి బస్తా ఏ రోజుకు ఆ రోజు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాలకు ఎగుమతి అవుతోంది.
బయటి బయ్యర్లు పోటీపడి కొనుగోలు చేస్తుండడంతో ఇప్పటి వరకు స్థానిక వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు మాత్రం కొనుగోలు చేయడం లేదు. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో దాదాపుగా 70 వేల ఎకరాల్లో పత్తిసాగు విస్తీర్ణం తగ్గింది. పొరుగు రాష్ర్టాలు, జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ఖరీదుదారులు పోటీపడుతున్నారు. చెక్కు చెదరని తెల్లని రంగు ఇక్కడి పంట ప్రత్యేకం కావడంతో ఇతర రాష్టాల బయ్యర్లు అక్కడికి తీసుకెళ్లి తమ పంటలో మిశ్రమం చేసి జిన్నింగ్ చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే కొద్దిరోజుల్లో క్వింటా పత్తి ధర రూ.10 వేల మార్క్ను చేరుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
రైతులు సంతోషిస్తున్నారు..
యార్డుకు పత్తి పంటను తెచ్చిన రైతుల ముఖాల్లో చిరునవ్వు, సంతోషం కన్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ధర రావడంతో వారు చాలా ఆనందంగా ఉంటున్నారు. సారవంతమైన నేలలు తెలంగాణ ప్రత్యేకత. కాబట్టి ఈ భూముల్లో పండించిన పంటకు మంచి ధర పలుకుతున్నది.
-రుద్రాక్ష మల్లేశం, ఖమ్మం ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి
తెలంగాణ పత్తికి ప్రత్యేక గుర్తింపు..
దేశంలో తెలంగాణ పత్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి నాణ్యత ఉండడమే ఇందుకు కారణం. ఇక్కడ ఉత్పత్తి అయిన పత్తిని కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోని జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ఈ పత్తిలో దూది పొడవు ఎక్కువగా ఉంటుంది. రంగు చెక్కు చెదరదు.
-కే.మాంతేశ్, బయ్యర్, బళ్లారి, కర్ణాటక
నాణ్యమైన పంటకు మంచి ధర..
ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మొదటిసారి తీసిన పంటను మార్కెట్కు తీసుకొస్తే గరిష్ఠ ధర పలికింది. నాణ్యంగా తీసుకొస్తే పత్తి పంటకు కాసుల వర్షం కురవడం కా యం. పత్తి పంటలకు ఇంత ఎక్కువ ధర రావడం సంతోషంగా ఉంది. -గోళ్ల లక్ష్మయ్య, రైతు, రాయపట్నం, మధిర