కొత్తగూడెం/ కొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 26: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కేపీసీ కంపెనీ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పని విభజనతో జాప్యానికి తావుండదని సూచించారు. కలెక్టరేట్ సముదాయంలోని ఖాళీ ప్రదేశాన్ని అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేయాలని, నిర్మాణ పనుల్లో కాలయాపన చేస్తే సహించమని పేర్కొన్నారు. నిధుల సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఆర్అండ్బీ ప్రాజెక్టు డీజీఎంకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్, ఇంట్రా ఈఈ నళిని, ఆర్అండ్బీ డీఈ నాగేశ్వరరావు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ స్వామి, కేపీసీ కంపెనీ ప్రాజెక్టు డీజీఎం నరసింహారావు పాల్గొన్నారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై సమీక్ష
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 2022 ఫిబ్రవరిలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై అధికారులు సమీక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియం, ప్రగతి మైదానాన్ని వారు పరిశీలించారు. అనంతరం కలెక్టర్తో ఆర్మీ కల్నల్ మనోజ్, అజయ్కుమార్యాదవ్, జిల్లా యువజన క్రీడల అధికారి టి.సీతారాం, ఆఫీస్ సూపరింటెండెంట్ ఉదయ్కుమార్ సమీక్షించారు. రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే యువకులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వారికి సూచించారు.