కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 24 : మండలంలోని జుజ్జల్రావుపేట పంచాయతీ ఆర్థిక వనరులను పెంపొందించుకుంటూ అభివృద్ధి దిశలో పయనిస్తోంది. గ్రామం నుంచి జిల్లాస్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు ఉన్నారు. 50ఏండ్ల క్రితం ప్రారంభించిన గ్రంథాలయం ఇప్పటికీ నడుస్తున్నది. ఇటీవలే రూ.2 లక్షల పల్లెప్రగతి నిధులతో గ్రంథాలయ భవనానికి మరమ్మతులు చేశారు. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ గణనీయమైన అభివృద్ధి సాధించింది. పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సమకూర్చుకోవాలని నిర్దేశించింది. దీనికోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, ప్రతినెలా వాయిదాలు చెల్లించేలా ప్రణాళికలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్ని పంచాయతీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ట్రాక్టర్లు సమకూర్చుకున్నాయి. అయితే జుజ్జల్రావుపేట పంచాయతీ మాత్రం బ్యాంకుపై ఆధారపడకుండా పంచాయతీ నిధులు రూ. 5.80లక్షలతో ట్రాక్టర్, రూ.1.80 లక్షలతో ట్యాంకర్, రూ.1.40 లక్షలతో ట్రక్కు కొనుగోలు చేసింది. అలాగే పంచాయతీ నిధులు రూ.2.50 లక్షలతో కల్వర్టులు, 2.50 లక్షలతో లింక్ రోడ్లు, రూ.2 లక్షలతో సైడ్ డ్రెయిన్లు నిర్మించారు. శివారులోని వాల్యాతండాలో ఎస్టీ సబ్ప్లాన్ నిధులు రూ.10 లక్షలతో రెండు సీసీ రోడ్లు నిర్మించారు.
రూ.40 లక్షల అభివృద్ధి పనులు
గత రెండేళ్లలో గ్రామంలో సుమారు రూ.40 లక్షల శాశ్వత అభివృద్ధి పనులు జరిగాయి. వీటిలో రూ.22 లక్షలతో రైతువేదిక, రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2.20 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణాలతో పాటు, రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు జరిగింది. పంచాయతీ ఆధ్వర్యంలో వర్మీ కంపోస్టు యూనిట్ కూడా నిర్వహిస్తున్నారు.
40 వేల మొక్కల పెంపకం
గత ఏడేళ్లలో పంచాయతీ పరిధిలో సుమారు 40వేల మొక్కల వరకు నాటి, పెంచుతున్నారు. ప్రతి ఏటా ఇంటికి ఆరుమొక్కలు అందించడంతోపాటు, పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం పల్లె ప్రకృతి వనంలో 2వేలు, మూడు రోడ్లకు ఇరువైపులా(ఎవెన్యూ ప్లాంటేషన్) 1200, రైతు వేదికలో 400, వైకుంఠధామంలో 600 మొక్కలు నాటి, పెంచుతున్నారు.
మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి
1957 మంది జనాభా ఉన్న మా పంచాయతీకి నెలానెలా రూ.2 లక్షల వరకు నిధులు వస్తున్నాయి. గతంలో కూడా మా పంచాయతీలో నిధులు ఉన్నాయి. పారిశుధ్యం, రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి పనులు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నాం. పల్లెప్రగతి కార్యక్రమం వల్ల గ్రామంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. నా హయాంలో జరిగిన శాశ్వత పథకాలు ప్రజలకు చిరకాలం గుర్తుంటాయి.