కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు
ఖమ్మం నగర ప్రజలందరికీ కృతజ్ఞతలు
నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, మే 4 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఖమ్మం గుమ్మం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా వాడవాడలా తిరిగి అభివృద్ధికి స్వయంగా పక్కా ప్రణాళికను చేసి జంట నగరాలకు దీటుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిధులు మంజూరు చేశారని తుమ్మల పేర్కొన్నారు. ఆ నిధులతోనే ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టిందన్నారు. రెండేళ్ల క్రితం ఖమ్మం నుంచి వెళ్లినవారు తిరిగి ఇప్పుడు ఖమ్మం వస్తే గుర్తుపట్టలేనంతగా అభివృద్ధి చెందిందన్నారు. ఖమ్మం నగర ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా నీరందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. ఖమ్మం అభివృద్ధిని కళ్లారా చూసిన నగర ప్రజలు కార్పొరేషన్ పాలకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ నగరాభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిదన్నారు. ప్రజలందరికీ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజారంజక పాలన అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, పోటీచేసి ఓటమి చెందిన అభ్యర్థులు నిరాశకు గురికాకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తుమ్మల పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు అందరూ బాధ్యతగా మెలిగి ప్రజలు ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని ఖమ్మం కార్పొరేషన్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తుమ్మల అన్నారు.