చింతకాని, అక్టోబర్ 19: అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయని, దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. చింతకాని గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ మొదటి విడతగా చింతకాని మండలానికి రూ.100 కోట్లు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. సీఎం కేసీఆర్ దళితబాంధవుడని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలం ఎంపిక కావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. మండలంలోని 5,012 దళిత కుటుంబాలు లబ్ధిపొందనున్నాయన్నారు. సీఎం కేసీఆర్తోనే దళితుల సాధికారిత సాధ్యమని, దేశానికే దిక్సూచిలా దళితబంధు పథకం నిలువనున్నదని అన్నారు.
దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితుల దిశ మారిందని స్పష్టం చేశారు. నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని, ఆయన సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని అన్నారు. దళితబంధు ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి అజెండాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ ప్రవేశపెట్టి అమలు చేయని పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. దశాబ్దాలుగా మారని దళితుల తలరాతలు.. సీఎం కేసీఆర్ పాలనలో మారనున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మండలంలో దళితులందరికీ దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు, దళిత నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.