పాలేరు నియోజకవర్గంలో పంటలపై తీవ్ర ప్రభావం
7 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం
పంట నష్టం అంచనా వేసిన వ్యవసాయశాఖ
రైతులను ఆదుకుంటాం :పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
నియోజకవర్గంలో పంటలపై తీవ్ర ప్రభావం
ఎకరాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం
నష్టం అంచనా వేసిన వ్యవసాయశాఖ
204 ఎకరాల్లో నేలరాలిన మామిడి, బొప్పాయి, నిమ్మ
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 6 : అకాల వర్షం, బలమైన గాలులు జిల్లాలోని పాలేరు నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో నామమాత్రంగా ఉన్నా.. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం మండలాల్లో కురిసిన వర్షానికి బొప్పాయితోటలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆయా గ్రామాల్లో మామిడిచెట్ల కొమ్మలు విరిగిపోయాయి. నిమ్మతోటలు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం ఉద్యానశాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు దెబ్బతిన్న పొలాలను పరిశీలించి పంట నష్టం అంచనా వేశారు. వీటితోపాటు ఆయా గ్రామాల్లో మిర్చిపంటను కల్లాల్లో నిల్వ చేసుకున్న రైతులు పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో బొప్పాయి 50 ఎకరాలు, మామిడితోటలు 150 ఎకరాలు, నిమ్మ మరో 4ఎకరాల్లో దెబ్బతిన్నది. మంగళవారం సాయంత్రం అధికారులు పంటల పరిశీలించి ప్రాథమిక నివేదికను ఉన్నతాదికారులకు చేరవేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి మరో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆయా గ్రామాల విస్తరణ అధికారులు, మండల, డివిజన్ వ్యవసాయశాఖ అధికారులు పొలాలను పరిశీలించారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.
రైతులను ఆందుకుంటాం : ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి : వడగడ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, వారు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పంటలను పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడారు. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు.