కూసుమంచి, జూలై 31: మత్స్య పరిశ్రమలకు మార్కెట్లో ఆదరణ ఉందని, ఫలితంగా మంచి లాభాలు కూడా వస్తున్నాయని జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభాను అన్నారు. ఇటీవల కేజ్ కల్చర్పై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పాలేరులోని పీవీ నర్సింహారావు పశు వ్యవసాయ విశ్వవిద్యాలయ మత్స్య పరిశోధనా కేంద్రంలో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన మత్స్య రైతులకు ప్రధానమంత్రి మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు కొనసాగుతున్న శిక్షణ శనివారం ముగిసింది. సీనియర్ సైంటిస్టు డాక్టర్ జీ.విద్యాసాగర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మాట్లాడారు. కేజ్ కల్చర్లో దాణా, నీటి యాజమాన్య పద్ధతులను వివరించారు. మెళకువలు పాటించి అధిక దిగుబడి పొందాలని సూచించారు. అనంతరం విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ చేపల పెంపకంపై రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అన్నారు. కొన్నేళ్లుగా పాలేరు శిక్షణ కేంద్రంలో జరుగుతున్న శిక్షణ వారికి ఎంతో అవగాహనను కల్పిస్తోందని అన్నారు. సైంటిస్టులు రవీందర్, శాంతన్న, సీనియర్ పరిశోధకురాలు నందిని కూడా రైతులకు అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది రైతులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.