రఘునాథపాలెం/ సత్తుపల్లి రూరల్/ కూసుమంచి రూరల్/ నేలకొండపల్లి, ఆగస్టు 1: పల్లెలు, పట్టణలు మునుపటిలా లేవు. నిధుల లేమితో కుంటు పడిన స్థితిలో అసలే లేవు. చిన్న పంచాయతీలకూ ప్రతి నెలా నిధులు మంజూరవుతుండడంతో అవి అభివృద్ధి బాట పట్టాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అవి సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఊరూరా పచ్చని పందిళ్లతో సోయగాలను విరజిమ్ముతున్నాయి. రఘునాథపాలెం మండలంలో కొత్త పంచాయతీగా ఏర్పడిన పువ్వాడ ఉదయనగర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. సత్తుపల్లిలోని పట్టణ ప్రకృతివనం నందనవనాన్ని తలపిస్తోంది. కూసుమంచి మండలంలోని తురకగూడెం దినదినాభివృద్ధితో దూసుకెళ్తోంది. నేలకొండపల్లి మండలంలోని ఆచార్లగూడెం అభివృద్ధితో మెరిసిపోతోంది.
నందనవనంలా ‘పట్టణ ప్రకృతివనం’
సత్తుపల్లిలోని పట్టణ ప్రకృతివనం నందనవనాన్ని తలపిస్తోంది. రూ.5 లక్షలతో పచ్చదనం ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దారు. అందమైన పూలు, పండ్ల మొక్కలతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. సత్తుపల్లి నడిబొడ్డున పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని ప్రకృతివనాన్ని ఏర్పాటుచేశారు. ఏపీలోని కడియం నుంచి ప్రత్యేకంగా మొక్కలు తెప్పించి నాటించారు. పట్టణ ప్రకృతివనంలో సుమారు 2800 రకాలు కలిగిన పూలు, పండ్ల మొక్కలను నాటారు. ఈ పట్టణ ప్రకృతివనంలో పిల్లలు ఆడుకునేందుకు జారుడు బల్లలు, ఊయల, ఇతర ఆటసామగ్రి వంటివి అమర్చారు. పెద్దల కోసం కూడా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటుచేసి వారి ఆరోగ్య రక్షణకు అవకాశం కల్పించారు. అంతేగాక ఇందులో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం కనువిందు చేస్తోంది.
స్వచ్చతలోనూ పట్టణానికి దీటుగా..
పల్లెప్రగతి కార్యక్రమం రఘునాథపాలెం మండలంలోని పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. నిధులను సద్వినియోగం చేసుకోవడంతో ఈ గ్రామం పట్టణానికి దీటుగా రూపుదిద్దుకుంటున్నది. గ్రామ జనాభా 3,025 మంది. సుమారు 966 కుటుంబాలు. 1800 మంది ఓటర్లు. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. అంతర్గరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీరు ఇంటింటికీ అందుతున్నది. డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రకృతి వనంలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటి లోపల వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు.
అభివృద్ధి బాటలో ‘ఆచార్లగూడెం’
నేలకొండపల్లి మండలంలోని ఆచార్లగూడెం ఒకప్పుడు కోనాయిగూడెం పంచాయతీలో శివారు గ్రామంగా ఉండేది. మూడేళ్ల క్రితం దీనిన్ని తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీగా ఏర్పాటు చేసింది. శివారు గ్రామంగా ఉన్న సమయంలో ఆచార్లగూడెంలో అభివృద్ధి ఉండేది కాదు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, ప్రత్యేక పంచాయతీగా రూపుదిద్దుకున్నాక ఈ గ్రామం దశ తిరిగింది. నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. గ్రామ జనాభా 821 మంది. ఓటర్లు 624 మంది. రూ.పది లక్షలతో సీసీ రోడ్లు, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.4 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. 180 మందికి ఆసరా పింఛన్లు వస్తున్నాయి.
తురకగూడెంలో దశలవారీగా అభివృద్ధి
కూసుమంచి మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం తురకగూడెం. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లె ఇది. కానీ స్వరాష్ట్రంలో గడిచిన ఏడేళ్లుగా గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. ఒక్కో వసతి కల్పించుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది. పల్లెప్రగతిలో భాగంగా రూ.20 లక్షలతో నాలుగు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, 2.50 లక్షలతో చెత్త సెగ్రిగేషన్ షెడ్డు, పల్లెప్రకృతి వనం ఏర్పాటయ్యాయి. గ్రామంలో నిర్మించిన 29 డబుల్ బెడ్రూం ఇండ్లను ఇటీవలే పేదలకు పంపిణీ చేశారు. గ్రామంలో 700 మంది ఓటర్లు, 1200 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.79 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు గ్రాంట్ వస్తోంది. పల్లెప్రగతి ద్వారా పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ వచ్చాయి. పారిశుధ్యానికి, మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కూసుమంచి, కిష్టాపురం రోడ్డుతోపాటు వైకుంఠధామంలో ఇటీవల 500 మొక్కలు నాటారు.