ఇల్లెందు, జూలై 28:ఉభయ గోదావరికి దీటుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు దూసుకెళ్తున్నాయి. సాగు, తాగునీటితోపాటు మత్స్య సంపద తదితర వాటిల్లో ఉమ్మడి జిల్లా తెలంగాణలోనే ప్రఖ్యాతిగాంచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు ఊతమిచ్చారు. ఫలితంగా రిజర్వాయర్లలో జలసవ్వడి నెలకొంది. దుమ్ముగూడెం వద్ద ఏర్పాటు కాబోయే సీతమ్మ సాగర్ ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా మారనున్నది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు వరిగిన్నెగా తయారుకానున్నాయి. సీతారామ, సీతమ్మసాగర్ , వివిధ రిజర్వాయర్లతో సాగు సస్యశ్యామలంగా మారుతున్నది.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నదిగా ప్రసిద్ధిగాంచిన గోదావరి.. భద్రాద్రి జిల్లాలో సుమారు 110 కిలోమీటర్ల మేర ప్రవహించనున్నది. మహారాష్ట్రను దాటుతూ తెలంగాణను ముద్దాడుతూ బంగాళ ఖాతం వైపు పరుగులు పెడుతుంది. అఖండ జీవనదిగా పేరుగాంచిన గోదావరి పరివాహకమంతా భద్రాద్రి జిల్లాలో ఉండడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాజేడు మండలం పేరూరు వద్ద ప్రారంభమైన గోదావరి వేలేరుపాడు పాపికొండల వద్దకు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. పోలవరం నిర్వాసిత ప్రాంతంతో భద్రాచలం వరకే ప్రస్తుతం గోదావరి పరిమితమైంది. అదే విధంగా చర్లకు పైభాగం వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో కలిశాయి. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో 250 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహించేది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 110 కిలోమీటర్ల మేర దిగువకు వెళ్తోంది. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని గోదావరి నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా చక్రం తిప్పాడు. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు నీటిరంగాలతోపాటు మత్స్య సంపదకు పెద్దఎత్తున దూసుకెళ్తున్నది. ఉమ్మడి పది జిల్లాల్లో ఖమ్మం జిల్లా అగ్రగామిగా దూసుకుపోనున్నది. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలు వరిగిన్నెలుగా పేరుగాంచినవి. అంతకుమించి ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రస్తుతం ఏర్పడిన భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు వాటిని తలదన్నే రీతిలో సాగునీటి రంగంలో ముందుకుపోనున్నాయి. ఏజెన్సీ సస్యశ్యామలం కానున్నది.
పర్యాటకంగా అభివృద్ధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నది. గోదావరి పరివాహక అందాలు, ప్రాజెక్టులను తిలకించేందుకు పర్యాటకులు పెద్దఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తరలొస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని, గోదావరి పరివాహక ప్రాంతాలను పెద్దఎత్తున ఆగస్టు, సెప్టెంబర్లో సందర్శించనున్నారు. ఇప్పటికే సందర్శకులతో ఆయా ప్రాంతాలు కోలాహలంగా మారాయి. అదే విధంగా ఖమ్మం జిల్లాలో పాలేరు, వైరా రిజర్వాయర్ల వద్దకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ల వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యాటకులు పెద్దఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మానికి తరలొస్తున్నారు.
సీతమ్మ సాగర్కు శ్రీకారం..
గోదావరి జలాలతో రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకొచ్చింది. భద్రాద్రి జిల్లాలో అపారంగా ప్రవాహం దిగువకు వెళ్తుందని, విద్యుత్, సాగు, తాగునీటి రంగాలకు ఆనకట్ట కడితే మేలని ప్రభుత్వం భావించింది. అదే అదనుగా దుమ్ముగూడెం వద్ద సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించిన సర్వే పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 27టీఎంసీల రిజర్వాయర్ను ఏర్పాటు చేసేందుకు దుమ్ముగూడెం వద్ద ప్రతిపాదనలు చేశారు. అదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు తాగు, సాగు నీటికి ఢోకా లేదు. మిషన్ భగీరథ గోదావరి నీళ్లు ప్రతి గడపను తడుతున్నాయి. సీతమ్మసాగర్ పూర్తయితే సాగు, తాగునీటితోపాటు విద్యుత్ రంగాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందడుగు వేయనుంది.
రెండు రిజర్వాయర్లు
భద్రాద్రి జిల్లాలో గోదావరికి రెండు ఉపనదులున్నాయి. ఒకటి కిన్నెరసాని, రెండోది తాలిపేర్లపై ఆనకట్టలు నిర్మించారు. 8.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కిన్నెరసాని రిజర్వాయర్ తాగు, సాగునీటితోపాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. కిన్నెరసాని ప్రాజెక్టు కింద పది వేల ఎకరాలు సాగవుతున్నది. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల దాహార్తిని తీర్చుతున్నది. కేటీపీఎస్కు ఎంతగానో కిన్నెరసాని ఉపయోగపడుతుంది. 750 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కిన్నెరసాని తలమానికంగా మారింది. తాలిపేరు విషయానికొస్తే సాగునీటి ప్రాజెక్టు 0.73 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించారు. 13.8వేల హెక్టార్లు సాగవుతుంది. పూర్తి ఏజెన్సీలో తాలిపేరు ప్రాజెక్టు కట్టడమనేది ఒక చరిత్ర. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రెండు పంటలకు నీళ్లందిస్తూ భద్రాచలం ఏజెన్సీని సస్యశ్యామలం చేసింది.