Collector Garima Agarwal | సిరిసిల్ల టౌన్, నవంబర్ 12: సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఆమె బుధవారం పరిశీలించారు. చెరువు కట్ట పైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు. ఇక్కడ అవసరమైన యంత్రాలు, సామగ్రిపై ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్ ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అక్కడి నుండి రైతు బజార్ కి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రైతు బజార్ లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ ను పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక్కడ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్ఓ రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా అధికారులు తదితరులు పాల్గొన్నారు.