కరీంనగర్ : దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మార్కెట్ యార్డ్ ఆవరణలో హుజురాబాద్ డివిజన్లోని 623 మంది దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్ల విలువైన వివిధ ఉపకరణాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సమైక్య ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు.
దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సీఎం కేసీఆర్దే. దివ్యాంగులకు నెలకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గుర్తు చేశారు. ఏటా దివ్యాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.