ఆలయాలు, పాఠశాలల్లో సరస్వతీ దేవీకి ప్రత్యేక పూజలు
చిన్నారులకు అక్షరాభ్యాసం
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 5: మాఘ శుద్ధ పంచమిని పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాలు, పాఠశాలల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో చైతన్యపురి మహాశక్తి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, గాయత్రీనగర్ గణేశారదాశంకరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అఖిల బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వామన్రావు, పురం ప్రేంచందర్ రావు, మదన్మోహన్ రావు, శశికాంత్ రావు, అశోక్రావు, అర్చకుడు వామనశర్మ పాల్గొన్నారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో..
కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో సరస్వతీ దేవీకి విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బాసర క్షేత్రాన్ని తలపించేలా వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా సరస్వతీ అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన భజనలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని పారమిత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాలల డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, రాకేశ్, వినోద్రావు, అనుకర్రావు, వీయూఎం ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బ్లూబెల్స్ పాఠశాలలో..
హనుమాన్నగర్లోని బ్లూబెల్స్ పాఠశాలలో వసంతపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతీ అమ్మవారికి ప్రిన్సిపాల్ జంగ సునీతా-మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక సిద్ధార్థ హైస్కూల్లో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో సరస్వతీ దేవీకి ప్రత్యేక పూజలు చేశారు. విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి, దాసరి జగత్పాల్రెడ్డి కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.