శంకరపట్నం : జనం ఉండే ప్రదేశాల్లోనే వ్యాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటు చేయాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్తో కలిసి కేశవపట్నంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బందిని వ్యాక్సినేషన్ సరళిని అడిగి తెలుసుకున్నారు.
కేశవపట్నం గ్రామ జనాభా ఎంత..? ఇప్పటి వరకు గ్రామంలో ఎంత వరకు వ్యాక్సినేషన్ పూర్తయింది.., మొదటి, రెండో డోసు వివరాలు.. ప్రతిరోజూ టార్గెట్.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ మందకొడిగా కొనసాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైతే ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది సహాయం తీసుకోవాలని చెప్పారు.
జనం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి టీకాలు వేయాలని అన్నారు. వైద్య బృందాలను పెంచి గ్రామంలో మరో రెండు రోజుల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. టీకాలు పూర్తైన ఇండ్లకుగ్రీన్ స్టిక్కర్స్ అతికించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సయ్యద్ షాకీర్ అహ్మద్, ఎంపీఓ సురేందర్, ఉప సర్పంచ్ గజెల్లి హన్మంతు, పంచాయతీ కార్యదర్శి చిట్టి, ఏఎన్ఎం శ్రీవాణి, గ్రామస్థాయి అధికారులు ఉన్నారు.