రాజన్న సిరిసిల్ల జూలై 21 (నమస్తేతెలంగాణ)/సిరిసిల్ల టౌన్: కార్మిక, ధార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పేదలకు పెద్ద రోగం వస్తే ప్రాణాలు కాపాడేందుకు మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరియా దవాఖానలో ఐసీయూ విభాగాన్ని 2017 ఆగష్టు 22న అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. పది పడకలతో, పది వెంటిలేటర్లు, ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. కాగా, అప్పటి నుంచి నేటి వరకు 3,142 మంది రోగులకు వైద్యులు సేవలందించారు.
ఈ-ఐసీయూలో వైద్యులు
ఈ విభాగంలో పది పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అనస్థీషియన్లు తిరుపతి, జాన్సీ, రవీందర్, పీ తిరుపతి, జనరల్ ఫిజీషియన్లు అరుణ, సంతోష్, ప్రదీప్తో పాటు వెంటిలేటర్ టెక్నీషియన్ లక్ష్మణ్, నర్సులు మమత, మాధవి, సుమలత 24గంటల పాటు రోగులకు వైద్యం అందిస్తున్నారు.
అందుబాటులో ఆధునిక పరికరాలు
ఈ- ఐసీయూ విభాగంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. రెండు వెంటిలేటర్లు, ఒక 2డీ ఎకో, రెండు పారామానిటర్స్ సెవన్పారా, 8 పారామానిటర్స్ ఫైవ్పారా, 10 సిరంజి పంప్స్, 5 ఇన్ఫిజన్ పంప్స్, 6 బైపాప్స్, ఒక డిఫిబ్రిలేటర్, ఒక మొబైల్ ఎక్స్రే, ఒక ఈసీజీ అందుబాటులో ఉన్నాయి.
అత్యవసర వైద్య సేవలు
ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే చిన్న సమస్యతో వచ్చినా కరీంనగర్ వంటి ప్రాంతాలకు రెఫర్ చేసేవాళ్లు..మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా దవాఖానలో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మంత్రి సూచనతో ఏర్పాటు చేసిన ఈ-ఐసీయూ లో వర్చువల్ విధానంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో గుండెపోటు, ఊపిరితిత్తులు, పక్షవాతం, మెదడులో రక్తం గడ్డ కట్టడం, నరాల సమస్య, పాయిజన్, పాముకాటుకు గురైన బాధితులకు అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడుతున్నారు.
వైద్యం అందించే విధానం
ప్రాణాపాయ స్థితిలో ఈ-ఐసీయూ విభాగంలో చేరిన రోగులకు నిమ్స్కు చెందిన ఈ-ఐసీయూ హబ్ ద్వారా రఘుకిశోర్(కార్డియాలజిస్టు), పద్మజ(అనస్థీషియన్) వర్చువల్ విధానంలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీని కోసం ఈ-ఐసీయూ హబ్ అనుసంధానంతో పది పడకల వద్ద పది హైవిజువలైజేషన్ సీసీ కెమెరాలు, ఒక ల్యాప్టాప్ను అందుబాటులో ఉంచారు. మొదట అపస్మారక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల ఆరోగ్యస్థితిని ఇక్కడి వైద్యులు వర్చువల్ విధానంలో నిమ్స్ వైద్యులకు వివరిస్తారు. వారు రోగుల స్థితిని స్డడీ చేసి చికిత్సా విధానం, వినియోగించాల్సిన మందులను సూచిస్తారు. ప్రతి గంటకు ఒకసారి 24 గంటల పాటు ఇలా పర్యవేక్షిస్తారు.
మంత్రి కేటీఆర్ అభినందనలు
ఈ విధానం ద్వారా గత నెల 13 నుంచి 36 రోజుల వ్యవధిలో 85 మందికి వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడడంతో మంత్రి కేటీఆర్ వైద్యులను అభినందిస్తూ మేసేజ్లు పంపారు. మంత్రి అభినందనలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు.
గర్వంగా ఉంది..
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. మంత్రి కేటీఆర్ సూచనతో ఏర్పడిన ఈ-ఐసీయూ ద్వారా హై ఎమర్జెన్సీ కేసులకు వైద్యం అందించగలుగుతున్నాం. కార్పొరేట్ దవాఖానల వైద్యులు సైతం తమతో కాదని పంపించిన కేసులకు ఇక్కడ చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడినం. ఇప్పటి వరకు 80 మందికి పైగా రోగులకు సేవలు అందించినం. భవిష్యత్ కాలంలో ఇక్కడి ప్రజలకు ఈ-ఐసీయూ ప్రాణదాతగా నిలుస్తుంది.
నిమ్స్ నుంచి వైద్యులకు సూచనలిస్తున్న డాక్టర్ పద్మజ
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో గత నెల 13న ఈ-ఐసీయూ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించుకున్నాం. నిమ్స్కు చెందిన డాక్టర్ పద్మజ, డాక్టర్ రఘుకిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హై ఎమర్జెన్సీ కేసులకు అందించాల్సిన చికిత్సా విధానంపై మా వైద్యులకు సూచనలిస్తున్నారు. తద్వారా రోగులకు అత్యాధునిక వైద్యం అందించి ప్రాణాలు నిలపగలుగుతున్నాం.
బతుకదని చెప్పిండ్రు
మా అవ్వ నర్సవ్వకు 70 ఏండ్లుంటయి. పది రోజుల కింద ఒక్కసారిగ మాటలు బందైనయి. సిరిసిల్లల ప్రైవేటు దవాఖాన్లకు పోతే కరీంనగర్కు రాసిన్రు. అక్కడి ప్రైవేటు దవాఖానల రూ.లక్ష డిపాజిట్తోపాటు రోజుకు రూ.25 వేలు మందులకు అయితయి, ఐనా ప్రాణం గ్యారంటీ లేదని చెప్పిన్రు. రెండ్రోజుల తరువాత బతుకుడు కష్టం, ఇంటికి తీసుకపొమ్మన్నరు. దేవుని మీద భారం వేసి ఎైట్లెతె గట్లాయనని సిరిసిల్ల సర్కారు దవాఖాన్లకు తీసుకచ్చి సూపెట్టిన. సచ్చినా.. బతికినా ఇక్కడే అని డాక్టర్లకు మొక్కిన.. దవాఖాన్ల చేరినంక సార్లు మంచిగ చూసుకున్నరు. ఒక్క రూపాయి ఖర్చు లేకుంట మా అవ్వను పాణాలతో మాకు అప్పగించిన్రు. కేటీఆర్ సార్ మా ఆయుషు పోసుకుని సల్లగుండాలె.