రామడుగు: బృహత్ పల్లెప్రకృతి వనం( బీపీపీ)లో మొక్కలను త్వరితగతిన నాటాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని దేశరాజ్పల్లిలో పదెకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతివనాన్ని పరిశీలించి, ఇప్పటివరకు ఎన్ని మొక్కలను నాటారని అధికారులను అడుగగా 12 వేల మొక్కలను నాటినట్లు వారు తెలిపారు. మిగతా మొక్కలను త్వరగా నాటాలన్నారు. సమీపంలో నిర్మించిన తడి, పొడి చెత్త యూనిట్ను పరిశీలించారు.
అనంతరం షానగర్ చేరుకొని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించి, గ్రామంలో ఇప్పటివరకు ఎంతమందికి కొవిడ్ టీకాను పంపిణీ చేశారని ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు, దేశరాజ్పల్లి సర్పంచు కోల రమేష్, ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి, పీఆర్ ఏఈ సచిన్, ఏపీవో రాజు, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.