కరీంనగర్ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న-సిరిసిల్ల జిల్లాలతో కూడిన సమగ్ర కరీంనగర్ జిల్లా అవసరాలను తీర్చడానికి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్, మేనేజర్, సహాయక సిబ్బందితో కూడిన క్లస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించింది. అంతకుక్రితం నాబార్డ్ కార్యాలయం కేవలం డీడీఎం తో వన్ మ్యాన్ షోగా మాత్రమే ఉండేది. విస్తరణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో క్లస్టర్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు నాబార్డ్ క్లస్టర్ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో ఒక మొక్కను కూడా నాటారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలో క్లస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయ సమాజానికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయన్నారు.
వాటర్షెడ్ కార్యక్రమాలు, ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, రైతు క్లబ్లు, మహిళా సాధికారత, మైక్రో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రొగ్రాంలు, మహిళలకు, వ్యవసాయ సమాజానికి వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమాలు వంటి కార్యకలాపాలను నాబార్డ్ విస్తరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) సీఈవో ఎన్ సత్యనారాయణ, లీడ్ జిల్లా మేనేజర్ కె లక్ష్మణ్, నాబార్డ్ క్లస్టర్ మేనేజర్ మనోహర్ రెడ్డి, ఎన్జీఓల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.