కరీంనగర్: ఈటల రాజేందర్ దళిత వ్యతిరేకి అని సుంకె రవిశంకర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలకు కర్రు కాల్చి వాతపెడతరని దుయ్యబట్టారు. దళితబంధుపై పిచ్చి మాటలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. హుజూరాబాద్కు ఈటెల ఏం చేసిండో చెప్పి ఓట్లడగాలన్నారు. కరీంనగర్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ దళితబంధుకు రూపకల్పన చేశారన్నారు. దళిత్ ఎంపవర్మెంట్ కింద సీఎం కేసీఆర్ బడ్జెట్లోనే రూ.1000 కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. దళితబంధు నిధులు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డాయని చెప్పారు.
పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెస్తుంటే బీజేపీ సర్కార్ సబ్సిడీలను ఎత్తివేస్తున్నదని, ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమం కోసం బీజేపీ ఒక్క పథమైనా తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన ఆ పార్టీని ప్రజలు తరిమికొడతారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులిస్తే ఖర్చు చేయలేని దద్దమ్మ ఈటల అని ఆగ్రహం వ్యక్తంచేశారు.