గంభీరావుపేట, మార్చి 16: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శృంగేరి జగద్గురు భారతీ తీర్థ స్వామి సప్తతి (70) మహోత్సవాలకు హరిహర దేవాలయం ముస్తాబైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ఆలయ ఆవరణలో శతచండీ యాగం నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే యాగంలో భాగంగా అఖండ రామనామ సప్తాహం, సామూహిక కుంకుమార్చన, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం గురుదేవతా ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, చండీ యంత్ర స్థాపన, సప్త శతీ పారాయణం, కుంకుమార్చన, నవార్ణ పూజ, కన్యకా పూజ, నవాక్షరీ మూల మంత్ర అనుష్టానం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అపూర్వ ఫలాన్ని అందించే ఈ యాగములో అందరూ పాల్గొని భాగస్వాములు కావాలని యాగ నిర్వాహకులు వ్యాసోజ్జల రామశర్మ, దేశపతి సుదర్శన శర్మ, వ్యాసోజ్జల రాధాకృష్ణశర్మ తెలిపారు.
అందరూ ఆహ్వానితులే
లింగన్నపేట హరిహర దేవాలయంలో నిర్వహిస్తున్న శతచండీయాగ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. సమస్త ప్రాణులు, సకల జనుల సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ, అందరూ సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం సాగించాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నాం. చండీ అమ్మవారి పుణ్యప్రదమైన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.