‘బీసీలంటే పట్టని.. నీచంగా చూస్తున్న బీజేపీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తుంది. ఆ పార్టీకి ఓటెందుకు వేయాలి..? దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ సైతం కులవృత్తులను ఏనాడైనా పట్టించుకున్నదా..? ఏదైనా న్యాయం చేసిందా..? బీసీలను వారిని నాశనం చేసేందుకే ఈ రెండు జాతీయ పార్టీలు పుట్టినయి’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి హరీశ్రావు అధ్యక్షతన హుజూరాబాద్లోని మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన గౌడ కులస్తుల ఆశీర్వాద సభకు హాజరై, మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ రాష్ర్టానికి చేసిందేం లేదని, ఈ విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే గౌడన్నల ఆత్మగౌరవం పెరిగిందని, ఓ భరోసా దొరికిందని చెప్పారు. కేసీఆర్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): జాతీయ పార్టీలు బీసీలకు ఏనాడూ న్యాయం చేయలేదని, వారిని నాశనం చేసేందుకే ఆ పార్టీలు పుట్టాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, యువజన, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీలకు ఏం న్యాయం చేసిందో చర్చించేందుకు తాము ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకులు కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం అయిన తర్వాతనే గౌడ కులస్తుల గౌరవం పెరిగిందన్నారు. కల్లు గీత వృత్తిని గత పాలకులు హీనంగా, నీచంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు గీత వృత్తికి గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునే సమయం అసన్నమైందని స్పష్టం చేశారు.
బుధవారం మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, గౌడ సంఘం నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ చేశారు. అక్కడే కాకతీయ కాలువ వద్ద ఎకరం స్థలంలో కోటి రూపాయల నిధులతో గౌడ సంఘం భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అన్యాయం చేశాయని, ముఖ్యంగా కల్లు గీత కార్మికులను హీనంగా చూశాయని మండిపడ్డారు. ఈ పార్టీలు పాలించిన 70 ఏండ్లలో కల్లు గీత వృత్తి ఎలా ఉండేదో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో గౌడన్నలు ఒకసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధపడిన నాయకుడు కేసీఆర్ సీఎం అయిన తర్వాత గౌడల బతుకులు పూర్తిగా మారిపోయాయని, వారికి, వారి వృత్తికి గౌరవం పెరిగిందని చెప్పారు.
స్వరాష్ట్రంలోనే సముచిత గౌరవం
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వృత్తికి గొప్ప గౌరవం వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వృత్తి పన్ను రద్దు చేశారని, చెట్టు పన్ను రద్దు చేయించారని, వృత్తిలో ప్రమాదవశాత్తూ మరణించిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారని ఉద్ఘాటించారు. ఇప్పుడు గౌడన్నలు ఎంతో ధైర్యంగా వృత్తిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్లు గీత వృత్తి గౌడ కులస్తులకే చెందుతుందని ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే జీవో ఇచ్చిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గుర్తు చేశారు. నీరాను కేవలం గౌడ కులస్తులే అమ్మాలని, ఇతరులెవరైనా అమ్మితే జైల్లో పెట్టాలని ప్రత్యేక జీవో ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్దేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో గౌడన్నలకు వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించి 360 దుకాణాలు వారికి దక్కేలా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. చేతి వృత్తుల వారు కేవలం బండ్లు కొనుగోలు చేసుకునేందుకే రూ.వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టారని చెప్పారు. గౌడలకు వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పాలని ప్రశ్నించారు.
బీసీలంటే బీజేపీకి చిన్నచూపు
హైదరాబాద్లో రూ.300 కోట్ల విలువైన భూమిని సీఎం కేసీఆర్ గౌడ సోదరులకు ఇచ్చారని, అదే విధంగా ముదిరాజ్లకు, మున్నూరు కాపులకు, నాయీబ్రాహ్మణులు, రజకులు, బట్రాజులు ఇలా అన్ని కులాలకు స్థలాలు కేటాయించారని, గతంలో ఏ ప్రభుత్వమైనా ఏ కులానికైనా జానెడు జాగనైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కుల వృత్తులను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలను చిన్న చూపు చూస్తున్న బీజేపీకి ఎట్లా ఓటెందుకు వేయాని ప్రశ్నించారు. ఈ రాష్ర్టానికి బీజేపీ చేసింది ఏమీ లేదని, ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. చర్చకు ఎక్కడికైనా రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బీజేపీ ఇక్కడ గెలిచే ముచ్చటే లేదని, గెలిచినా చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పొరపాటున అక్కడొకరు ఇక్కడొకరు ఓటు వేసినా అది మోరీలో వేసినట్లేనన్నారు. గౌడ కులస్తులకు ఇంత మేలు చేసిన పార్టీకి ఓటు ద్వారా రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, పేద, బడుగు, బలహీన వర్గాలను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కేసీఆర్ను బలపర్చవల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి హరీశ్రావుతో కలిసి వెళ్లి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ను కోరుతామని, త్వరలోనే అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుకునేందుకు జీఓ జారీ అయ్యేలా చూస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. గీత కార్మికుల మోపైడ్స్ కూడా వచ్చేలా సీఎంతో మాట్లాడుతామని చెప్పారు. ఇంత వరకు మనల్ని ప్రోత్సహించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునే సమయం హుజూరాబాద్లో వచ్చిందని, అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఈ సందర్భంగా గౌడ కులస్తులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేదోడు. ఉద్యమకారుడు. తెలంగాణ కోసం జైళ్లో ఉన్నడు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. శ్రీను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు మేలు జరుగుతది. మీలో ఒకరిగా ఉండే సీనును మీరంతా దీవించాలి. అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
కేసీఆర్కు ఎన్నికలు లెక్క కాదు
హుజూరాబాద్, సెప్టెంబర్ 22: ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్కు ఎన్నికలు ఒక లెక్క కాదని, అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్న విషయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే బీసీల బతుకులు బాగుపడ్డాయని, ఇక్కడ బీసీల కోసం ప్రవేశపెట్టిన పథకాలను దేశానికే ఆదర్శమయ్యాయని ఉద్ఘాటించారు. మన రాష్ట్ర పథకాలను తమ వద్ద అమలు చేయాలని దేశంలోని చాలా రాష్ర్టాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రాష్ర్టాలు కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ముదిరాజ్ల కోసం ఆంధ్ర పరిపాలనలో చేప పిల్లలకు రూ.2కోట్లు కేటాయిస్తే ఇప్పుడు వారి సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు రూ.6వేల కోట్లు కేటాయించిందని పునరుద్ఘాటించారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ సంఘం జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్రావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నాయకులు నాగేందర్గౌడ్, రాజేశంగౌడ్ ఉన్నారు.
నామినేషన్ ఫీజు కడతాం.
గెల్లు శ్రీనివాస్యాదవ్ నామినేషన్ ఫీజును గీత కార్మికులమే శీరికకు ఒక రూపాయి చొప్పున చెల్లించి నామినేషన్ డబ్బులు కడుతం. గీత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేమందరం అండగా ఉంటం. అలాగే మూతపడిన గౌడ ఫెడరేషన్ను సీఎం కేసీఆర్, మంత్రులు తిరిగి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి. గీత కార్మికుల ఆరాధ్య నాయకుడైన, దైవ సమానుడైన సర్దార్ పాపన్నగౌడ్ జయంతిని, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా చూడాలి.
గౌడన్నల కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం
ఆరుగాలం కష్టపడే గౌడన్నల కష్టసుఖాలు గుర్తించిన ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచింది. గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నది. అలాంటి సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి గీత కార్మికులు, గౌడ కులస్తులు సంపూర్ణ మద్దతు తెలిపి అండగా ఉండాలి. ఉప ఎన్నికలో శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దే
గీత కార్మికుల ఉపాధి మెరుగుపడేలా ఈత, తాటి మొక్కలు పెంచడమే కాదు కులస్తులకు బార్లు వైన్స్లలో 15శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుంది. తాటిచెట్ల పన్ను రద్దు చేసి ఎంతో మేలు చేశారు. తాటి లైసెన్సులను పదేళ్ల వరకు పెంచి ఇవ్వడం గౌడ కులస్తులకు గర్వకారణంగా ఉంది. గీత కార్మికులను వైద్యపరంగా, ఆపద సమయంలో 5లక్షల జీవిత బీమా కల్పించి ఆదుకోవడం ఎన్నటికీ మరచిపోం. అన్ని విధాలా అండగా ఉండే టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటం.
గెల్లు గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తం..
గీత కార్మికుల బతుకులను మార్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటం. గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం గౌడ కులస్తులు అందరం శాయశక్తులా కృషి చేస్తాం. ఒకప్పుడు దీన స్థితిలో ఉన్న గీత కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వాలకు చేతులే రాలే. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గీత కార్మికులను, గౌడ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నరు. కేసీఆర్ నిలబెట్టిన శ్రీనివాస్యాదవ్ను లక్ష మెజార్టీతో గెలిపిస్తం.
-శ్రీపతి నరేశ్గౌడ్, జమ్మికుంట కౌన్సిలర్ (హుజూరాబాద్టౌన్)
నన్ను ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా గెలిపించండి. తలలో నాలుకలా పని చేస్త. మీ అందరికీ అండగా ఉంట. నాకు టికెట్ ఇచ్చే ముందు సీఎం కేసీఆర్ కొన్ని బాధ్యతలు అప్పగించిన్రు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేయించాలని చెప్పిన్రు. కేసీఆర్ 4 వేల ఇండ్లు ఇచ్చినా ఈటల రాజేందర్ కట్టించలేక పోయిండు. నేను ఆ బాధ్యతను తీసుకున్న. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా, నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేలా కృషి చేస్త. సీఎం కేసీఆర్ను అడిగి మంజూరు చేయిస్త.
మాట తప్పని కులం మాది..
మాట తప్పని, మడమ తిప్పని కులం గౌడ కులం. టీఆర్ఎస్ గెలుపునకు తామంతా కృషి చేస్తమని మాట ఇస్తున్నం. స్వరాష్ట్రం రాక ముందు, ఏడేళ్ల కింద గీత కార్మికులు ప్రభుత్వానికి బకాయి ఉన్న రూ.14 కోట్ల్ల పన్ను బకాయిలను మాఫీ చేసిన ఏకైక ఘన కేసీఆర్కే దక్కుతుంది. గీత కార్మికుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు నీరా అమ్ముకునేందుకు అవకాశం కల్పించడమే కాక, బార్లు, వైన్స్లలో 15శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఆదుకున్న సీఎం కేసీఆర్కు గీత కార్మికులందరం రుణ పడి ఉంటం. వచ్చే ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తం.
ఐక్యంగా ఉండాలి..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గౌడ కులస్తులకు తగిన ప్రాధాన్యత లభించింది. గతంలో మాదిరిగా గీత కార్మికులకు ఎక్సైజ్, పోలీసుల వేధింపులు లేవు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నరు. దళితబంధు పథకాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. అణగారిన ఆ వర్గాలను ఆర్థికంగా ఎదగడానికి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టిండు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన గెల్లు శ్రీనివాస్కు ఉప ఎన్నికలో అండగా ఉండాలి.
గెల్లును భారీ మెజార్టీతో గెలిపించాలి..
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. గౌడ కులస్తులు ఒక్కతాటిపైకి వచ్చి గెల్లు శ్రీనివాస్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా అందించాలి. గత ప్రభుత్వాల హయాంలో గీత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజమే. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో గౌడ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి ఐదెకరాల స్థలం, రూ.3కోట్లు నిర్మాణానికి ఇచ్చి కేసీఆర్ మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు. అన్ని రకాలుగా ఆదుకుంటున్న కేసీఆర్కు అండగా ఉండాలి. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.