కార్పొరేషన్, సెప్టెంబర్ 21: కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతలను అమెరికా కంపనీకి అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతున్నది.
వారం రోజుల్లో డీపీఆర్ను సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు ప్రధానమైన నది ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు తుది దశకు వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధం కాగానే దానిని ప్రభుత్వం ముందుకు తీసుకుపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయి. బ్రిడ్జికి సంబంధించి ఇరువైపులా కనెక్షన్ రోడ్లను నిర్మించాల్సి ఉంది. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఒక రూపువస్తే ఈ రోడ్డు పనులు కూడా మొదలవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
రూ.410 కోట్లతో సుందరంగా ప్రాజెక్టు
కరీంనగర్లోని మానేరు నదిపై రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రాజెక్టు పనులపై మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో టూరిజం, ఇరిగేషన్, కరీంనగర్ జిల్లా మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా మొదటి విడుతలో ఎల్ఎండీ నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రూ.310.46 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం వాల్స్ నిర్మాణానికి సంబంధించి డిజైన్ల ఆమోదం వస్తే వెంటనే టెండర్లు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కాకుండా ఇప్పటికే రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫౌంటెయిన్లు, బోటింగ్, కాటేజీలతో పాటు ప్రపంచ స్థాయిలో థీమ్ పార్కులు ఏర్పాటు చేసేందుకూ చర్యలు చేపట్టారు. ఇప్పటికే డీపీఆర్ తయారీలో వీటన్నింటినీ పొందుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మేరకు అనుకున్న సమయంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
పర్యాటక కేంద్రంగా మానేరు తీరం
ప్రభుత్వం చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ తో మానేరు నది తీరం పర్యాటక కేంద్రంగా మారనున్నది. ఈ ప్రాజెక్టును రెండు విడుతల్లో చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మొదటి విడుతలో ఏడు కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయటంతో పాటు రెండో విడుతలో నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నదిలో పూర్తిస్థాయిలో బోటింగ్ నిర్వహించుకునేందుకు వీలుగా ఇప్పటికే ఆరుకు పైగా చెక్ డ్యాంల నిర్మాం చేపడుతున్నారు. వీటితో పాటుగా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వీటితో పాటు నదికి ఇరువైపులా ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కూడా సేకరించి ప్రపంచస్థాయి ప్రమాణాల్లో అభివృద్ధికి అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొదలై పనులు చేపడితే నగరానికి కొత్త శోభ రానున్నది.