హుజూరాబాద్, సెప్టెంబర్ 14: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు అలుపెరుగని యాత్ర చేస్తున్నారు. రెండుమూడు రోజులుగా ఇక్కడే ఎక్కువగా ఉంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కలియదిరుగుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా గౌడ , గీత కార్మిక, మహిళా, చేనేత సంఘాలు, టీఎన్జీఓలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు.
రోజంతా బిజీబిజీ
మంత్రి హరీశ్రావు మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు. తొమ్మిది గంటలకు ఇల్లందకుంటలోని సీతారామ దేవాలయ ఫంక్షన్హాల్లో గౌడ సంక్షేమం, గీత కార్మికుల సమావేశమయ్యారు. 10 గంటలకు జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్లో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్లో, 2 గంటలకు వీణవంక మండల కిష్టంపేట గ్రామంలో పీఎస్ కల్యాణమండపంలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి హాజరై, వివిధ పథకాల మంజూరైన చెక్కులు అందించారు. చివరగా సాయంత్రం 6 గంటలకు పజూరాబాద్లోని సిటీ సెంటర్ ఫంక్షన్హాల్లో టీఎన్జీఓల సమావేశానికి హాజరై, మాట్లాడారు.
లేచింది మహిళాలోకం..
హరీశ్రావు సభకు 5వేలకుపైగా హాజరైన సంఘం సభ్యులు
మహిళా లోకం నిద్ర లేచింది. ఒక్కసారిగా కదిలివచ్చింది. పది కాదు, వంద కాదు.. 5వేల మంది తరలివచ్చి, ‘జై తెలంగాణ నినాదాలు’ చేయడంతో జమ్మికుంట పట్టణమంతా దద్దరిల్లింది. ‘అవతలోళ్లకు దడ పుట్టేలా’ చేసింది. మహిళా శక్తి అంటే.. ఎట్లుంటదో చూపించింది. మంత్రి హరీశ్రావు మంగళవారం కాటన్ మార్కెట్ యార్డులో వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణమాఫీ, కొత్త రుణాలు, తదితర పథకాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, మండంలోని మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో వచ్చారు. 20గ్రామాల నుంచి చిన్నా, పెద్ద వాహనాల్లో తరలివచ్చారు. కళాకారుల ఆట, పాటలకు గళమెత్తారు. నిర్వాహకులు 5వేల కుర్చీలు వేసినా, సరిపోలేదు. మొత్తంగా సమావేశం విజయవంతమైంది.