సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 14: బీజేపీ నేత బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా స్పందన లేని యాత్ర అని టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్కుమార్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీచౌక్ వరకు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో బండి సంజయ్ యాత్రకు ప్రజల మద్దతు లేదని తేలిపోయిందన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న వారంతా పార్టీ కార్యకర్తలే ఉంటున్నారన్నారు. ఎంపీగా గెలిపించుకున్నందుకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాట్లాడడం చేతకాని ఎంపీ ప్రజా సమస్యలను పార్లమెంట్ దృష్టికి ఎలా తీసుకెళ్తాడని విమర్శించారు. పండిత పుత్ర పరమశుంట అన్న చందంగా గంభీరావుపేట సర్పంచ్ కటకం శ్రీధర్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఎర్రకోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని వ్యాఖ్యానించిన శ్రీధర్ తెలంగాణలో ఎర్రకోట ఎక్కడ ఉందో ప్రజలకు తెలియజేయాలని హితవుపలికారు. బండి సంజయ్ పాదయాత్రతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై దమ్ముంటే మాట్లాడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో కత్తెర వరుణ్, మునీర్, సుధీర్, అంజద్, కిరణ్, శ్రీనివాస్రావు, సిఖిందర్, అప్రోజ్, బాబా, సాయి, తదితరులు పాల్గొన్నారు.