జమ్మికుంట, జూలై27: ‘ఏడేండ్లుగా రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. ఇదంతా మీ కండ్ల ముందే కనిపిస్తున్నది..’అంటూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే ఒరిగేదేంలేదని, పనిచేసే పార్టీకే పట్టంగట్టాలని హుజూరాబాద్ ఓటర్లకు పిలుపునిచ్చారు. తహసీల్దార్ రాజారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వినాయక గార్డెన్స్లో ఐఎంఏ భవనానికి పంచముఖ హనుమాన్ ఆలయ ఏరియాలో 10గుంటలు, ఎమ్మార్సీ సమీపంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘానికి 2గుంటలు, హమాలీ కార్మికులకు పాత భవనం స్థానంలో కొత్త దాని కోసం ప్రభుత్వ స్థలాలు, నిధుల మంజూరు పత్రాలను ఆయా సంఘాల బాధ్యులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. యూనియన్ల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ప్రతి సంఘానికి కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించిన ఈటల స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను మీకు అప్పగించిన తర్వాతే వెళ్లిపోతామని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వాన్ని మేధావులంతా బలపరచాలన్నారు.
ఉద్యమాల పోరుగడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్కు బహుమతిగా అందించాలని కోరారు. కాగా, స్వర్ణకారుల సంఘం నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేయగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ వరంగల్ ఎమ్మెల్యే నరేందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, పలు సంఘాల నాయకులు, సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.