కమాన్చౌరస్తా, జూలై 21: విద్యారంగం అభివృద్ధికి అయోధ్య రామారావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కీర్తించారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువు విగ్రహాన్ని మంత్రి హోదాలో ఆవిష్కరించడం గొప్ప అనుభూతినిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వాణీనినేతన్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీటీ ఆయోధ్య రామారావు విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మేయర్ వై సునీల్రావు, శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశ్ తదితరులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. అయోధ్య రామారావు ఏనాడూ విద్యను వ్యాపారంగా భావించలేదన్నారు.
ఇద్దరు టీచర్లు.. ఐదుగురు విద్యార్థులతో వాణీనికేతన్ పాఠశాలను ప్రారంభించి ఇంతితై వటుడింతై అన్నట్లుగా ఎదుగుదలకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. తన విద్యార్థులు మంత్రి హరీశ్రావు, గంగుల కమలాకర్, పద్మా దేవేందర్రెడ్డి ఒకే శాసన సభలో ఎమ్మెల్యేలుగా ఉండడం ఆయన ఎంతో గర్వంగా భావించారని గుర్తుచేసుకున్నారు. తాను మంత్రి కావాలని కోరుకున్న రామారావు, మంత్రిగా చూడకుండానే మృతిచెందడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ నేటి యువతరం అయోధ్య రామారావు నుంచి సమయ పాలన నేర్చుకోవాలని సూచించారు. లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఆయన మార్గం ఎంతో మందికి ఆచరణీయమన్నారు. మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు ఎమ్మెస్సార్ అయితే విద్యాబుద్ధులు నేర్పిన గురువు అయోధ్య రామారావు అన్నారు.
ఎస్యూ వీసీ మల్లేశ్, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అయోధ్య రామారావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత గణితంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డిగ్రీ విద్యార్థికి అయోధ్య రామారావు పేరిట గోల్డ్ మెడల్ అందించాలని నిర్ణయించారు. కాగా, ఆయన కుటుంబసభ్యులు ఇందుకు సంబంధించిన చెక్కును శాతవాహన యూనివర్సిటీ వీసీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రామారావు సతీమణి విద్యాసంస్థల చైర్మన్ విజయమ్మ, కార్పొరేటర్లు వాల రమణారావు, పెద్దపెల్లి జితేందర్, వాణీనికేతన్ విద్యాసంస్థల డైరెక్టర్లు రేణుక, దీపిక, పూర్వవిద్యార్థులు గంగుల సుధాకర్, నందెల్లి మహిపాల్, రవీందర్రావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.