కార్పొరేషన్, జూలై 21: జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అనుమతి లేని అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రవేశపెట్టిన లే అవుట్ల క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో వచ్చిన దరఖాస్తులను త్వరలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ జారీ చేసింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకంలో మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ది సంస్థలతో పాటు, గ్రామాల్లోని అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ పథకం కింద జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇలా వచ్చిన దరఖాస్తులను రానున్న 15 రోజుల్లో ఏరియాల వారీగా క్లస్టర్గా విభజించి సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
వెల్లువెత్తిన దరఖాస్తులు
ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకంలో నగరపాలక, మున్సిపాలిటీలతో పాటు సుడా పరిధిలోనూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2020 ఆగస్టు 26 ముందుకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది ఎల్ఆర్ఎస్ కింద అన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దరఖాస్తుతో పాటు వ్యక్తిగత ప్లాట్ అయితే రూ. 1000, లే అవుట్లకు అయితే రూ. 10వేల ఫీజు నిర్ణయించారు. తదనంతరం వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాలోని సుడాతో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ, కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 15,067, సుడా పరిధిలో 11796 దరఖాస్తులు వచ్చాయి. కొత్తపల్లి మున్సిపాలిటీలో 207, చొప్పదండిలో 1251, హుజూరాబాద్లో 3,327, జమ్మికుంటలో 2,976 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
క్లస్టర్లవారీగా విభజన
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులను వచ్చే 15 రోజుల్లోగా క్లస్టర్ల వారీగా విభజన చేయడంతో పాటు క్షేత్రపర్యటనలను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా నగరపాలక, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారీగా వచ్చిన దరఖాస్తులను వేరు చేయనున్నారు. ఈ పక్రియను వచ్చే రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దరఖాస్తులు ఆన్లైన్లోనే రావడంతో వీటిని ప్రస్తుతం మున్సిపాలిటీల వారీగా వేరు చేసి పంపిస్తున్నారు. వీటిని ఏరియాల వారీగా వేరు చేసే పనులు మొదలుపెడుతున్నారు. ఇలా వేరు చేసిన దరఖాస్తులను రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసే కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నాయి. వారి పరిశీలన అనంతరం ఆయా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. వీటి అనంతరం తదుపరి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.