హుజూరాబాద్టౌన్, జూలై 21: హుజూరాబాద్ ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి హుజూరాబాద్ చిలుకవాగు పారగా, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మండలంలో 22.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. హుజూరాబాద్లోని కిందివాడ, మామిండవాడ, గాంధీనగర్, బుడగ జంగాలకాలనీ, ఎస్డబ్ల్యూకాలనీ, సిద్ధార్థనగర్, కొత్తపల్లి, ఇందిరానగర్లోని సిక్కులవాడ, బోర్నపల్లిలోని తెనుగువాడ, దమ్మక్కపేట ఎస్సీకాలనీ, ఇప్పల్నర్సింగాపూర్ ఎస్సీకాలనీ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలవడంతో పాటు పలువురి ఇండ్లలోకి చేరాయి. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం, బతుకమ్మ సౌళ్లలో చెరువును తలపించేలా నీరు నిలవడంతో కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక బస్టాండ్ ఆవరణ చెరువును తలపించింది. ఆయా ప్రాంతాల్లో కౌన్సిలర్లు సహాయక చర్యలు చేపట్టారు. చిలుకవాగు పారడంతో తెనుగువాడకు చెందిన మత్స్యకారులు వరదనీటిలో చేపలు పట్టారు. గుండ్ల చెరువు మత్తడి దుంకుతుండగా ప్రజలు తిలకించారు. రంగనాయకులగుట్టవద్ద చిలుకవాగు ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
22.6 మిల్లీ మీటర్ల వర్షపాతం
సైదాపూర్, జూలై 21: మండలంలో 22.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు గ్రామాల్లో చెరువులు, కుంటల్లో వరద నీరు వచ్చి చేరుతున్నది. పలు గ్రామాల్లో కల్వర్టుల వద్ద వరద నీటి ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం కలిగింది.
విడవని ముసురు.. కదలని జనం
శంకరపట్నం, జూలై 21: మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురు పడింది. దీంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా ఉండడంతో మబ్బులు కమ్ముకొని విడువకుండా ముసురు పడింది. బావులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాస్తవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మానకొండూర్లో..
మానకొండూర్, జూలై 21: మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో కుంటలు, చెరువుల్లోకి భారీగా నీరు వచ్చిచేరింది.
నిండుకుండలా చెరువులు, కుంటలు
మానకొండూర్ రూరల్, జూలై 21: మండలంలోని శ్రీనివాస్నగర్, ముంజంపల్లి, అన్నారం, చెంజర్ల, దేవంపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ముసురుతో కూడిన వర్షం పడింది. అన్ని గ్రామాల్లో చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. శ్రీనివాస్నగర్లోని బర్లాం చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. మత్స్యకారులు చేపలుపడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.