ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు
చొప్పదండి, జూలై 20: మండల ప్రజలు మంగళవారం తొలిఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వేకువజామునే తలంటు స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇండ్లల్లో పిండివంటలు చేసుకొని కుటుంబసభ్యులంతా కలిసి ఆరగించారు. పట్టణాల్లో ఉన్న వారంతా గ్రామాల్లోకి రావడంతో సందడి నెలకొంది.
గంగాధర, జూలై 20: మండలంలోని ఆలయాల్లో తొలిఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవతామూర్తులకు అభిషేకం, అర్చన, పుష్పాలంకరణ, తదితర పూజలు నిర్వహించారు. భక్తులు దేవాతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించకున్నారు. అనంతరం ఆలయాల్లో భజన కార్యక్రమం నిర్వహించారు.
రామడుగు, జూలై 20: మండలంలోని వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెలిచాల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాల్రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూలవిరాట్టుకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. పలువురు ఉపవాస దీక్ష చేపట్టారు.
కరీంనగర్ రూరల్, జూలై 20: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని దుర్గాభవానీ ఆలయంలో శాకాంబరీ నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని గోరుచిక్కుడు కాయల మాలలతో అలంకరించారు. వేదపండితుడు పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కార్పొరేటర్ వంగల శ్రీదేవి, ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, శానగొండ మధుసూదన్, భక్తులు పాల్గొన్నారు.