వెల్గటూర్, జూలై 20: బీజేపీవన్నీ బడాయి మాటలు అని, వాళ్లకు ఓట్ల రాజకీయం తప్ప ఇంకెం చేతకాదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. వారి మాటలు నమ్మొద్దని.. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా.. చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం వెల్గటూర్ మండలంలో మంత్రి పర్యటించారు. మండలకేంద్రంతోపాటు గొడిసెలపేటలో రైతు వేదికలను జడ్పీ చైర్పర్సన్తో కలిసి ప్రారంభించారు. వెల్గటూర్లో డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, శానబండ, గోడిసెలపేటలో 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కిషన్ రావుపేట, స్తంభంపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రైతు బీమా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలుగా తయారు కావాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన మూడన్నరేళ్లలోనే ఏటా ప్రభుత్వం 12 వేల కోట్ల ఖర్చు చేసి 24 గంటల ఉచిత విద్యుత్, మరో 12 వేల కోట్లతో రైతు బంధు అందిస్తున్నదని తెలిపారు. ఏటా రైతుల తరపున ఇన్సూరెన్స్ కంపెనీకి 5 వేల కోట్లు చెల్లించి రైతు బీమా, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ లాంటి అనేక పథకాలు అందజేస్తున్న ఘనత దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే, కేసీఆర్కే దక్కుతుందన్నారు. 65 ఏండ్లు పాలించిన పాలకులు ఏనాడైనా రైతుల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. అనతికాలంలోనే భారీ ప్రాజెక్ట్లు నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తూ, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ దేశంలోనే నంబర్ వన్గా మారి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తయారైందని స్పష్టం చేశారు. అది కేవలం కేసీఆర్ కృషేనని కొనియాడారు.
ఇక్కడ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, వైస్ ఎంపీపీ కవిత, ఏఎంపీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు గూడా రాంరెడ్డి, గోలి రత్నాకర్, రైతుబంధు మండల కోర్డినేటర్ చుక్క శంకర్రావు, మాజీ ఎంపీపీ గంగుల అశోక్, సర్పంచులు మెతుకు స్వరూప స్వామి, మారం జలేంధర్ రెడ్డి, గాగిరెడ్డి లింగమ్మ రాజేశ్వర్రెడ్డి, మేరుగు మురళి, గంగుల నగేశ్, బోడకుంటి రమేశ్, కొప్పుల సాగర్, మేర్గు కోంరయ్య, గంగారాం, పొన్నం స్వరూప తిరుపతి, బిటుకు పద్మ, రామిల్ల లావణ్య సనిల్, పార్టీ మండల శాఖ అద్యక్షులు చల్లూరి రాంచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జగన్, నాయకులు మూగల సత్యం, పెద్దూరి భరత్, కొప్పుల సురేశ్, మారం జగన్ మోహన్రెడ్డి, పడిదం మొగిళి, నక్క రవితేజ, జుపాక కుమార్ జగిత్యాల ఆర్డీవో మాధురి, ఎంపీడీవో సంజీవరావు, ఏవో కరుణ, డీటీ సంతోష్ రెడ్డి, ఆరై స్వామి తదితరులు ఉన్నారు.